తెలంగాణ

telangana

ఘనంగా నాగోబా జాతర ప్రారంభం

By

Published : Feb 12, 2021, 4:25 AM IST

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమైన నాగోబా జాతర గురువారం అర్ధరాత్రి ఘనంగా ఆరంభమైంది. ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో మేస్రం వంశీయులు నాగదేవతకు గంగాజలంతో అభిషేకం జరిపి.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేల నుడుమ ప్రత్యేక పూజలు ప్రారంభించారు.

today beginning the Nagoba festival at keslapur
ఘనంగా నాగోబా జాతర ప్రారంభం

ఘనంగా నాగోబా జాతర ప్రారంభం

మేస్రం వంశీయుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర గురువారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీల పండుగగా పేరొందిన నాగోబా జాతర ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో సంప్రదాయ పూజలతో మొదలైంది. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి మేస్రం వంశీయులు మహాపూజను నిర్వహించారు.

సంప్రదాయ వాయిద్యాల నడుమ మహాపూజ కనుల పండువగా కొనసాగింది. ఈ పూజకు జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ విష్ణు వారియర్‌తోపాటు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. మహాపూజ అనంతరం ప్రత్యేక హారతిని భక్తుల నడుమకు తీసుకొచ్చారు. మహాపూజలో పాల్గొనేందుకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్​, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి మేస్రం వంశస్తులు తరలివచ్చారు.

తలకు పాగా ధరించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను తిలకించారు. తొలత మేస్రం వంశీయులు ఆ తర్వాత అధికారులు సంప్రదాయబద్ద పూజలు చేసి జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. మహాపూజ ముగిశాక కొత్త కోడళ్లను పరిచయం చేసే బేటింగ్‌ కార్యక్రమం కొనసాగించారు.

ఐదురోజుల పాటు కొనసాగే జాతర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను చేసిన అధికారులను మేస్రం వంశీయులు సత్కరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొనగా.. వచ్చే యేడాదిలోగా ఆలయ పున:నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సక్కు అధికారులను కోరారు. ఆదివాసీలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

ఇదీ చూడండి :'అపాయింట్​మెంట్​ ఇవ్వాలని మోదీకి లేఖ'

ABOUT THE AUTHOR

...view details