Beggar Was Raped And Murdered By Three Persons In Indhravelli : ఆదరించే వారు లేక యాచిస్తూ పొట్ట నింపుకునే మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.. భర్త రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త మృతితో కుమారుడితో నిరాధారంగా మిగిలింది. ఆ సమయంలో పాక్షికంగా మతి స్థిమితం కూడా కోల్పోయింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఆమె దీనస్థితిని చూసి.. ఆమె కుమారుడిని బంధువులు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేసి.. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
Beggar Was Raped In Adilabad : భిక్షాటన చేస్తూ బతుకుతున్న మహిళ.. జూన్ 20వ తేదీన చించోలి గ్రామం నుంచి ధనోరా(బి) గ్రామంలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకుంది. అప్పటికే చీకటి పడటంతో అక్కడే పడుకోవాలని నిర్ణయించుకుంది. ఒంటరిగా ఉన్న ఆమెతో ధనోరా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మాటలు కలిపి.. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడే తనపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత గొంతు నులిమి బావిలో పడేశారని పోలీసులు తెలిపారు. వర్షాలు కురవడంతో వ్యవసాయ కూలీలు జులై 1న పొలం పనులు చేయడానికి వెళ్లారు. బావిలో నుంచి దుర్వాసన రావడంతో.. అక్కడకు వెళ్లి చూడగా.. అందులో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.