IPL 2022: క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ సరికొత్తగా ముస్తాబైంది. కొత్తగా లీగ్లోకి అడుగు పెట్టిన లఖ్నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్లతో కలిపి ఈసారి పది జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా లీగ్ చరిత్రలో ఒక్క 2011 సీజన్లో మాత్రమే పది జట్లు పోటీ పడ్డాయి. ఈసారి మ్యాచ్ల సంఖ్య కూడా పెరగబోతోంది. అందుకే ఈసారి కాస్త ముందుగా, మార్చి చివరి వారంలోనే లీగ్ను మొదలు పెట్టేస్తున్నారు. శనివారం తొలి మ్యాచ్లో గత ఏడాది ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ తలపడబోతున్నాయి. కొవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని నేపథ్యంలో ఈసారి లీగ్ను ముంబయి, పుణె నగరాలకు పరిమితం చేశారు. బయో బబుల్ పరిధిలో ముంబయిలోని వాంఖడె, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు.. పుణెలోని ఎంసీఏ మైదానం మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఏ జట్టుదో బోణీ: 2021 సీజన్లో అట్టడుగున నిలిచి, గత ఏడాది అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. అద్భుత ఆటతో కప్పు ఎగరేసుకుపోయింది చెన్నై. నిరుడు ప్రథమార్ధంలో పేలవ ప్రదర్శన చేసి, ద్వితీయార్ధంలో గొప్పగా పుంజుకుని ఫైనల్ చేరి త్రుటిలో కప్పు చేజార్చుకుంది కోల్కతా. ఈసారి సమవుజ్జీల్లా కనిపిస్తున్న ఈ జట్లలో శుభారంభం చేసేది ఏదో చూడాలి. ఈ మ్యాచ్లో అందరి దృష్టీ చెన్నై మీదే నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టును నడిపిస్తున్న ధోనీ.. తొలిసారి కేవలం సభ్యుడిగా బరిలోకి దిగుతున్నాడు. మహీ నుంచి ఈ సీజన్కు జడేజా పగ్గాలందుకున్న సంగతి తెలిసిందే. మరి కెప్టెన్గా జడ్డూ ఎలాంటి ముద్ర వేస్తాడు, బ్యాట్స్మన్గా ధోనీ ఎలా ఆడతాడు అన్నది ఆసక్తికరం. ధోనీ, జడేజాలతో పాటు రుతురాజ్, ఉతప్ప, రాయుడు, డ్వేన్ బ్రావో లాంటి పాత ఆటగాళ్లనే చెన్నై జట్టులో చూడబోతున్నాం. వీరికి యువ ఆల్రౌండర్ హంగారేర్కర్తో పాటు కివీస్ పేసర్ మిల్నె, తోడవుతున్నారు. పిచ్ను బట్టి పేసర్ జోర్డాన్ లేదా స్పిన్నర్ తీక్షణను చెన్నై ఎంచుకోనుంది. మరోవైపు కోల్కతా.. కొత్త కెప్టెన్ శ్రేయస్కు తోడు, ఆల్రౌండర్లు వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైన్లే బలంగా బరిలోకి దిగుతోంది. నితీశ్ రాణా కూడా బ్యాటింగ్లో కీలకమే. ఫామ్లో లేకపోయినా రహానెకు తొలి మ్యాచ్లో ఓ అవకాశం ఇవ్వనుంది. అతనే వెంకటేశ్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం.
తుది జట్లు (అంచనా)... చెన్నై: రుతురాజ్, ఉతప్ప, కాన్వే, రాయుడు, జడేజా (కెప్టెన్), ధోనీ (వికెట్ కీపర్), దూబె, డ్వేన్ బ్రావో, హంగారేర్కర్, జోర్డాన్, తీక్షణ, మిల్నె
కోల్కతా:వెంకటేశ్ అయ్యర్, రహానె, శ్రేయస్, నితీశ్ రాణా, బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రసెల్, నరైన్, చమిక కరుణరత్నె, మావి, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్/రసిక్
ఎవరిదో కప్పు?
అంతర్జాతీయ క్రికెట్లో, ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో హాట్ ఫేవరెట్లు ఎవరంటే చెప్పడం సులువే. కానీ బలాబలాల్లో ఎక్కువ తేడా ఉండని ఐపీఎల్లో ఫలానా జట్టుదే టైటిల్, ఫలానా జట్టు ఏమీ బాగా లేదని ముందే అంచనా వేయడం కష్టమే. అయినా సరే.. ముందు నుంచి జట్టు కూర్పు, మ్యాచ్ ప్రణాళికల్లో పకడ్బందీగా వ్యవహరిస్తూ, లీగ్లో ఎక్కువ విజయవంతమైన ముంబయి, చెన్నై లాంటి జట్లను ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్లుగా పేర్కొనాల్సిందే. ఈసారి గరిష్ఠంగా నలుగురిని మినహా అట్టిపెట్టుకునే అవకాశం లేకపోయినా, మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి వీలైనంత ఎక్కువమంది పాత ఆటగాళ్లను ఈ రెండు జట్లూ సొంతం చేసుకున్నాయి. వీటికి బలమైన సహాయ బృందం ఉంది. ఈ రెండు జట్లకు తోడు కొన్ని సీజన్ల నుంచి నిలకడగా ఆడుతున్న దిల్లీ క్యాపిటల్స్ కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటే. శ్రేయస్ అయ్యర్ రాకతో కెప్టెన్సీ సమస్య తీర్చుకుని, జట్టును మరింత బలోపేతం చేసుకున్న కోల్కతా అవకాశాలనూ కొట్టి పారేయలేం. మిగతా జట్లు ఓ మోస్తరుగా అనిపిస్తున్నాయి.
కోహ్లీ స్థానంలో బెంగళూరు సారథ్య బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్, వార్నర్ సన్రైజర్స్ను వీడటం వల్ల పూర్తి స్థాయి కెప్టెన్గా మారుతున్న విలియమ్సన్ తమ జట్ల రాత మారుస్తారేమో చూడాలి. మయాంక్ సారథ్యంలోని పంజాబ్, శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్లపై అంచనాలు తక్కువే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, లఖ్నవూ సూపర్జెయింట్స్ జట్లుగా పర్వాలేదనిపిస్తున్నా.. ఈ కొత్త టీంలు బరిలోకి దిగాక కానీ వీటి ఆటపై ఓ అంచనాకు రాలేం. జట్ల సంఖ్య పెరుగుతోంది, ఫార్మాట్ మారుతోంది కాబట్టి పోటీ పెరుగుతుంది. ఉదాసీనతకు అవకాశమే లేదు. ప్రతి జట్టుకూ ప్రతి మ్యాచ్ కీలకమే. కాబట్టి లీగ్ రసవత్తరంగా సాగడం ఖాయం.
ఫార్మాట్ అలా కాదు..
గత సీజన్ వరకు లీగ్లో ప్రతి జట్టూ మిగతా ఏడు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడేది. మొత్తంగా ప్రతి జట్టుకూ 14 మ్యాచ్లు ఉండేవి. ఈ సీజన్లో రెండు జట్లు పెరిగినప్పటికీ.. ఒక్కో జట్టు ఆడే మ్యాచ్ల సంఖ్య పెరగబోదు. ఇందుకోసం ఫార్మాట్ను మార్చారు. ఈ ప్రకారం పది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు.
అత్యధికంగా 5 టైటిళ్లు గెలిచిన ముంబయి గ్రూప్-ఎలో ఉంటే, నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై గ్రూప్-బిలో ఉంది. రెండు టైటిళ్లతో మూడో స్థానంలో ఉన్న కోల్కతాను గ్రూప్-ఎలో పెట్టి, ఒక టైటిల్ నెగ్గిన సన్రైజర్స్ను గ్రూప్-బిలో చేర్చారు. ఒక టైటిల్తో అయిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ను గ్రూప్-ఎలో, మూడుసార్లు ఫైనల్ ఆడిన బెంగళూరు గ్రూప్-బిలో పెట్టారు. ఒక్కో ఫైనల్ ఆడిన దిల్లీ, పంజాబ్లను వరుసగా గ్రూప్-ఎ, బిల్లో చేర్చారు. కొత్త జట్లు లఖ్నవూ, గుజరాత్లను కూడా ఇలాగే ఒక్కో గ్రూప్లో పెట్టారు. గ్రూప్లో ప్రతి జట్టూ మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. అలాగే అవతలి గ్రూప్లో తనతో సరిసమాన స్థాయిలో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్లు, మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ ప్రకారం ఒక్కో జట్టు ఆడే మొత్తం మ్యాచ్లు 14 అవుతాయి.
మరో డీఆర్ఎస్..
2018లో లీగ్లో ప్రవేశపెట్టిన నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్) అవకాశాలను ఒకటి నుంచి ఈ సారి రెండుకు పెంచారు. అంటే ఓ జట్టు ఓ ఇన్నింగ్స్లో రెండు సార్లు డీఆర్ఎస్ కోరవచ్చు. ఇక ఓ బ్యాటర్ క్యాచౌట్ అయితే కొత్తగా వచ్చే ఆటగాడు స్ట్రైక్ (ఓవర్ చివరి బంతి మినహా) తీసుకోవాలి. ఇటీవల మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ ఈ నిబంధనను సవరించింది. మరోవైపు కరోనా కారణంగా జట్లు మైదానంలో దిగే అవకాశం లేకపోతే ఆ మ్యాచ్ను వాయిదా వేస్తారు. ఒకవేళ ఆ మ్యాచ్ తిరిగి నిర్వహించే ఆస్కారం లేకపోతే ఐపీఎల్ సాంకేతిక కమిటీ సూచించిన ప్రకారం ఓ నిర్ణయం తీసుకుంటారు.