ETV Bharat / sports

IPL 2022: ఇవి మామూలు రికార్డులు కావు.. ఈసారి బ్రేక్​ చేస్తారా?

author img

By

Published : Mar 26, 2022, 8:01 AM IST

IPL 2022: క్రికెట్​ అభిమానులకు మరో రెండు నెలలు పండగే. అంతులేని వినోదాన్ని పంచేందుకు.. ఐపీఎల్ రెడీ అయింది. ఈ రోజే(శనివారం) డిఫెండింగ్​ ఛాంపియన్​ సీఎస్​కే, రన్నరప్​ కోల్​కతా మ్యాచ్​తో టోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇక, ఈ లీగ్ చరిత్ర​లో చాలా మంది ఆటగాళ్లు కొన్ని గొప్ప రికార్డులను నెలకొల్పారు. వాటిని బ్రేక్​ చేయడం అంత తేలికెేమీ కాదు. ఆ ప్రత్యేక రికార్డులు? వాటిని సాధించినవారెవరు? వంటి వివరాలను చూద్దాం.

mega-tourney-toughest-records-to-break
mega-tourney-toughest-records-to-break

IPL 2022: క్రికెట్‌లో ఎంత మంది ఎన్ని రికార్డులు నెలకొల్పినా.. కొన్నింటిని ఎవరూ బ్రేక్‌ చేయలేరు. అవి సాధించడానికి అంత తేలికేమీ కాకపోవడమే అందుకు కారణం. ఐపీఎల్​ టోర్నీలోనూ పలు గొప్ప రికార్డులున్నాయి. వాటిని చేరుకోవడం కష్టమే. మరి ఆ ప్రత్యేకమైన రికార్డులేంటో.. ఎవరెవరు వాటిని సాధించారో ఓ లుక్కేద్దాం..

బౌలర్లను దంచికొట్టాల్సిందే: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఒక సీజన్‌లో చేసిన అత్యధిక పరుగుల రికార్డును ఎవరూ అంత తేలిగ్గా సాధించలేరు. 2016లో అతడు 4 సెంచరీలు, 7 అర్ధ శతకాల సాయంతో మొత్తం 973 పరుగులు చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 152.03 స్ట్రైక్‌రేట్‌తో 81.08 సగటు నమోదు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే బౌలర్లను దంచికొట్టాల్సిందే.

విరాట్‌ కోహ్లీ
విరాట్‌ కోహ్లీ

సిక్సర్ల వాన కురవాల్సిందే: సహజంగా టీ20ల్లో శతకం సాధించడమే గొప్ప విశేషం. అలాంటిది ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 175 పరుగులు చేశాడంటే మాటలా! ఆ ఘనత సాధించింది క్రిస్‌గేల్‌. 2013లో అతడు బెంగళూరు తరఫున ఆడుతూ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. అందులో మొత్తం 13 బౌండరీలు, 17 సిక్సర్లు దంచికొట్టడం విశేషం. దీంతో ఆ మ్యాచ్‌లో గేల్‌ స్ట్రైక్‌రేట్‌ 265.15గా నమోదైంది. ఒకవేళ ఎవరైనా ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే స్టేడియంలో సిక్సర్ల జడివాన కురవాల్సిందే.

క్రిస్‌గేల్‌
క్రిస్‌గేల్‌

మరో కెప్టెన్‌ విశేషంగా రాణించాలి: ఇక మెగా టోర్నీల్లో అత్యంత విజయవంతమైన సారథిగా చెన్నై మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీకి గొప్ప పేరుంది. నాలుగు సార్లు ట్రోఫీ గెలవడమే కాకుండా అత్యధికంగా చెన్నైని ఫైనల్‌ చేర్చిన ఘనత అతడి సొంతం. 2008 నుంచీ గతేడాది వరకు మొత్తం 14 సీజన్లు జరిగిన టోర్నీలో 9 సార్లు ఫైనల్‌ ఆడిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ అందుకున్నా ఇలా ఎక్కువసార్లు ఫైనల్‌ చేరింది లేదు. దీంతో ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే.. ఆ భవిష్యత్‌ కెప్టెన్‌ ఎవరో విశేషంగా రాణించాలి.

ధోనీ
ధోనీ

ఈ రికార్డు ఊహించలేం: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ముంబయి పేసర్‌ ఆల్‌జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అప్పుడు హైదరాబాద్‌ జరిగిన ఓ మ్యాచ్‌లో అతడు 3.4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. అప్పుడు 16 డాట్‌బాల్స్‌ సంధించి 12 పరుగులే ఇచ్చాడు. దీంతో 3.27 అత్యుత్తమ ఎకానమీ నమోదు చేశాడు. ఇది మెగా టోర్నీలోనే మేటి బౌలింగ్‌ ప్రదర్శనగా నిలిచిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసి 136/7 స్కోర్‌ సాధించగా.. ఆపై ఆల్‌జారీ ధాటికి సన్‌రైజర్స్‌ 96 పరుగులకే ఆలౌటైంది.

ఆల్‌జారీ జోసెఫ్‌
ఆల్‌జారీ జోసెఫ్‌

ఇది ఎవరూ కోరుకోరు కూడా: ఒక మ్యాచ్‌లో అత్యంత ఘోరంగా బ్యాటింగ్‌ చేసిన జట్టు ఏదైనా ఉందా అంటే అది బెంగళూరు మాత్రమే. 2017లో కోల్‌కతాతో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. అప్పుడు కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌ చేసి 19.3 ఓవర్లలో 131 పరుగులకే పది వికెట్లు కోల్పోగా.. తర్వాత బెంగళూరు 49 పరుగులకే చాపచుట్టేసింది. ఆ ఇన్నింగ్స్‌లో కేదార్‌ జాదవ్‌ (9) టాప్‌స్కోరర్‌. గేల్‌ (7), డివిలియర్స్‌ (8), కోహ్లీ (0) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో బెంగళూరు అత్యంత తక్కువ స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ రికార్డును ఎవరూ కోరుకోరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈసారి ఎవరైనా రికార్డులను ఎవరు బద్దలు కొడతారేమో చూడాలి.

ఇదీ చదవండి: ఐపీఎల్​కు వేళాయెరా.. 10 జట్లతో ఈసారి మరింత కొత్తగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.