తెలంగాణ

telangana

BGT 2023: విరాట్​కు 'ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​'.. అశ్విన్​ ఖాతాలో మరో రికార్డ్​

By

Published : Mar 13, 2023, 5:32 PM IST

india vs australia fourth test virat kohli ashwin new records
india vs australia fourth test virat kohli ashwin new records ()

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్​లో అదరగొట్టిన విరాట్​ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. జడేజా, అశ్విన్‌లకు సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. సిరీస్‌ అంతా అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు వరించింది.

అశ్విన్‌, విరాట్‌లు ఈ అవార్డులకు ఎంపికైన అనంతరం వీరిద్దరి ఖాతాలో వేర్వేరు రికార్డులు వచ్చి చేరాయి. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్‌ (9 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు).. కల్లిస్‌ను (9) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ (10).. లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేతో (10) సమంగా నిలిచాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుల రికార్డు లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ (11) పేరిట ఉండగా.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల రికార్డు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ తెందూల్కర్​ (14) పేరిట ఉంది. సచిన్‌ తర్వాత ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ (11) ఉన్నాడు.

అయితే ఈ టెస్ట్​ మ్యాచ్‌ విషయానికొస్తే.. బౌలర్లకు ఏమాత్రం సహకరించిన పిచ్‌పై నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (90) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్‌ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (128), విరాట్‌ కోహ్లీ (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్ట్​లో శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్​ షిప్ ఫైనల్​కు టీమ్​ఇండియా చేరింది. జూన్​7న మళ్లీ ఆస్ట్రేలియాతోనే ఫైనల్​లో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details