నాలుగో టెస్టు డ్రా.. సిరీస్​ భారత్​ కైవసం.. మళ్లీ WTC ఫైనల్​ ఆసీస్​తోనే..

author img

By

Published : Mar 13, 2023, 3:37 PM IST

Updated : Mar 13, 2023, 4:03 PM IST

bgt 2023 india australia fourth test drawn

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరిదైన నాలుగో టెస్టు ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని భారత్ 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(90) రాణించాడు. ఆసీసీ బ్యాటర్లు లబుషేన్‌(63*), స్మిత్‌(10*) నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కాగా, ఫైనల్​లో కూడా ఆస్ట్రేలియాతోనే తలపడనుంది.

అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియాతో ఫైనల్​ ఆడేందుకు భారత్​తో పాటు శ్రీలంక పోటీ పడింది. న్యూజిలాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో శ్రీలంక ఓడిపోవడం వల్ల ఫైనల్​ ఆశలను చేజార్చుకుంది. జూన్​ 7వ తేదీ నుంచి జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ లండన్​లోని ఓవల్​ మైదానంలో జరగనుంది.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​.. 70 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్‌ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

కివీస్​ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్‌ (121*) సెంచరీతో చెలరేగాడు. మరో బ్యాటర్​ డారిల్‌ మిచెల్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టామ్‌ లేథమ్ (24), హెన్రీ నికోల్స్ (20) డేవన్ కాన్వే (5), మిచెల్‌ బ్రాస్‌వెల్ (10), బ్లండెల్ (3) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, జయసూర్య 2.. రజిత, లాహిరు కుమార చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు సాధించిది. అయితే కివీస్​ దీటుగా స్పందించి 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 302 పరుగులకు కుప్పకూలింది. దీంతో శ్రీలంక ఓటమిపాలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్​ బెర్త్.. టీమ్​ఇండియాకు దక్కింది.

Last Updated :Mar 13, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.