తెలంగాణ

telangana

కరోనా వచ్చెన్.. క్రికెట్​లో మార్పులు తెచ్చెన్!

By

Published : Jun 16, 2020, 12:05 PM IST

కరోనా కారణంగా క్రికెట్ సిరీస్​లన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొన్ని సడలింపుల కారణంగా మళ్లీ టోర్నీలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కరోనా సమయంలో మ్యాచ్​లు జరిగితే ఎలాంటి మార్పులు చూడబోతున్నామో తెలుసుకుందాం.

క్రికెట్
క్రికెట్

కరోనా మహమ్మారి ప్రపంచ పోకడను మార్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్ల వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. జనజీవనమే ఇలాంటి కఠిన నియమాలతో సాగుతుంటే మరి క్రీడా టోర్నీల మాటేమిటి. అవును మీరు ఊహిస్తోంది నిజమే. టోర్నీలు ఎప్పుడు ప్రారంభమైనా కొన్ని నియమనిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. రాబోయే రోజుల్లో క్రికెట్​ సిరీస్​ల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయో చూద్దాం.

భౌతిక దూరం పాటిస్తూ

నెల ముందుగానే జట్లు పర్యాటక దేశాలకు చేరుకోవాలి

ప్రస్తుతం విదేశాల్లో పర్యటించడానికి ఏ దేశమూ అనుమతించడం లేదు. భవిష్యత్​లోని సడలింపుల్లో భాగంగా క్రికెట్​ సిరీస్​లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆటగాళ్లు మాత్రం ముందుగా క్వారంటైన్​లో ఉండాల్సిందే. క్రికెటర్లు ఆ దేశ పరిస్థితులకు అలవాటు పడేందుకు, కావాల్సిన ప్రాక్టీస్​ కోసం కనీసం ఓ నెలరోజుల ముందుగానే పర్యాటక దేశానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనిని బట్టే దేశాలు వారి వారి షెడ్యూల్​ను రూపొందించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాస్కుతో వెస్టిండీస్ ఆటగాళ్లు

ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్​లు

ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్​ బోర్డులు మ్యాచ్​ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే టోర్నీలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే వీలైనంత తొందరగా పర్యటనలను ముగించేందుకు ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్​లు జరిపేందుకు కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అంటే ఒక జట్టు ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. టెస్టు, టీ20 రెండు మ్యాచ్​లను ఒకే రోజు ఆడటం వీలవుతుంది. అందుకోసం ఈ రెండు ఫార్మాట్లకు తగిన విధంగా జట్లను విడదీయాల్సి ఉంటుంది. దీనివల్ల యువ ఆటగాళ్లు వారి ప్రతిభను నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలను లభిస్తాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత్​-ఆసీస్ మ్యాచ్​ (పాతది)

ఖాళీ మైదానాలు/తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు

కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు భౌతికదూరం పాటించడమనేది తప్పనిసరి. సామూహికంగా గుమిగూడటం లాంటివి ఉండకూడదు. అందుకే ఈ సమయంలో మ్యాచ్​లు జరిగినా మైదానాల్లో ప్రేక్షకులకు అనుమతి మాత్రం దాదాపు ఉండదు. కానీ కొన్ని దేశాలు మాత్రం భారీ సామర్థ్యమున్న స్టేడియాల్లో 25 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించడానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై మేధావుల సలహాలు తీసుకుంటున్నాయి. ఐపీఎల్​ కూడా ఖాళీ మైదానాల్లో నిర్వహించాలా లేక తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతినివ్వాలా అనే విషయమై బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

ఖాళీ మైదానం

కరచాలనం రద్దు, పరిమిత సెలబ్రేషన్స్

ఏ మ్యాచ్​లయినా సెలబ్రేషన్స్​ అనేవి తప్పనిసరి. క్రికెట్​లోనూ ఆటగాళ్లు సంబరాలకు బాగా అలవాటు పడినవారే. కానీ కరోనా కారణంగా ఈ సెలబ్రేషన్స్​కి బ్రేక్ పడనుంది. కరచాలనం పూర్తిగా రద్దవ్వగా.. ఆటగాళ్లు దూరంగా ఉండే మిగిలిన సంబరాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా థంబ్స్ అప్, బంప్స్​ను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్, డగౌట్లలో కూడా భౌతిక దూరం పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.

టీమ్​ఇండియా (పాత చిత్రం)

బౌండరీల వద్ద శానిటైజింగ్ యంత్రాలు

కరోనా కారణంగా పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరైపోయింది. ఏం చేసినా, ఏం చేయబోతున్నా శానిటైజర్​ వాడాల్సిందే. అందుకే ఆటగాళ్లు ఆరోగ్య పరంగా రక్షణాత్మకంగా ఉండటానికి బౌండరీల వద్ద శానిటైజింగ్ యంత్రాలు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఫీల్డర్లు తరచూ శానిటైజింగ్ చేసుకునే వీలుంటుంది. అలాగే డ్రింక్ బ్రేక్ సమయంలోనూ ఈ శానిటైజింగ్ ఉపయోగపడుతుంది.

బౌండరీల వద్ద శానిటైజర్లు

ABOUT THE AUTHOR

...view details