"మా' అసోసియేషన్ నిషేధించిన విషయం ఎప్పుడో మర్చిపోయాను. దానికి ప్రతీకారంగా ఇప్పుడు పోటీ చేయట్లేదు. ఇవేమీ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు కాదు కదండి" అని అన్నారు ప్రకాశ్ రాజ్(Prakash Raj News). 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి(Alitho Saradaga Talk show) విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం ఇది. అక్టోబరు 11న ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
తన గురువు కె.బాలచందర్ ప్రకాశ్ రాజ్గా పేరు మార్చారని చెప్పిన ప్రకాశ్ రాజ్.. లక్ష్మిగారు ఒకసారి తనను చూసి దక్షిణ భారతదేశంలో గొప్ప నటుడు అవుతారని అన్నారని నటుడిగా తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. "పోకిరి' కూడా నేను చేయాల్సింది కాదు' అని ప్రకాశ్ రాజ్ అన్నారు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఇద్దరిలో ఎవరిష్టం? అని అడిగిన ప్రశ్నకు "కృష్ణవంశీ నా బంగారం. కొంచెం స్వార్థపరుడు. కానీ, వాడినే ఎక్కువగా ప్రేమిస్తాన"ని ప్రకాశ్ రాజ్ సమాధానమిచ్చాడు.