తెలంగాణ

telangana

Bigg Boss 5: ప్రియకు బంపర్ ఆఫర్.. కెప్టెన్​గా ఎవరో?

By

Published : Oct 8, 2021, 9:09 AM IST

బిగ్​బాస్ తెలుగు సీజన్ 5(BigBoss Telugu season 5)లో ప్రియాంక పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిగాయి. అలాగే ఈ వారం కెప్టెన్సీ టాస్క్​లో ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. మరి వారిలో ఎవరు కెప్టెన్​గా ఎంపికయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

Bigg Boss 5
బిగ్​బాస్

బిగ్‌బాస్‌ హౌస్‌(BigBoss Telugu season 5)లో ప్రియాంక పుట్టినరోజు సెలబ్రేషన్స్ వేడుకగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా హౌస్‌మేట్స్‌(bigg boss 5 housemates telugu) అంతా కలిసి ఆమెకి పువ్వులు, గాజులు, చీరని కానుకగా అందించారు. 'నాన్నా సాయితేజ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు సర్వం నువ్వే. అమ్మాయిగా మారావని నిన్ను ఆదరించటం మానేస్తామా. ఎప్పుడూ, అలా అనుకోవద్దు' అని తన తండ్రి భరోసా ఇస్తూ ఓ వీడియోని హౌస్‌కి పంపించాడు. అది చూసిన ప్రియాంక ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. 'నా సొంత ఇంటికి కూడా నేను దొంగలా వెళ్తా. నేనొచ్చానని మా పక్కింటి వారికీ తెలియదు. ఈ రోజు మా నాన్న నన్ను అంగీకరించి నువ్వు ఇంటికి రావొచ్చు అంటే ఏదో తెలియని ఫీలింగ్‌. మా నాన్నని పట్టుకుని గట్టిగా ఏడవాలని ఉంది' అని చెబుతూ హృదయాలను బరువెక్కించింది.

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌(BigBoss Telugu season 5)లో కెప్టెన్సీ టాస్క్‌ ఆసక్తికరంగా సాగుతోంది. కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే క్రమంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన రాకుమారుల టాస్క్‌ జరుగుతోంది. గురువారం ఈ టాస్క్‌ అనేక కీలకమలుపులు తిరిగింది. టాస్క్‌లో భాగంగా ఏ రాకుమారుడికైతే ఎక్కువమంది ఇంటి సభ్యుల మద్దతు ఉంటుందో అతను కెప్టెన్సీ పోటీదారుడు అవుతాడని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఏడుగురి ఇంటిసభ్యుల మద్దతుతో రవి(bigg boss telugu ravi) యువరాజుగా ఎంపికయ్యాడు.

రవి

ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌..

రాకుమారుల టాస్క్‌లో భాగంగా ఎవరి దగ్గరైతే ఎక్కువ నాణెలు ఉంటాయో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని భావించిన మానస్‌, షణ్ముఖ్‌, జెస్సీ, సిరిలకు బిగ్‌బాస్‌ షాక్‌ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీదారుడిగా, టాస్క్‌లో గెలిచి రాకుమారుడిగా ఎంపికైన రవి తనకు మద్దతు తెలిపిన వారిలో ముగ్గుర్ని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేసుకోవచ్చని బిగ్‌బాస్‌ చెప్పాడు. అలాగే, ఓడిపోయిన రాకుమారుడి టీమ్‌లోని ప్రజల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకోవచ్చని తెలిపాడు. దీంతో సన్నీ(bigg boss telugu sunny) టీమ్‌లోని వారంతా షాక్‌ అయ్యారు. నాణెలు ఎక్కువ ఉంటే కెప్టెన్సీ పోటీదారులు అవుతామని భావించిన.. షణ్ముఖ్‌, జెస్సీ, మానస్‌లు తీవ్ర విచారంలోకి వెళ్లిపోయారు. తాము చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని వాపోయారు.

రాకుమారుడిగా రవికి పట్టాభిషేకం..

ఇంటి సభ్యుల మద్దతుతో రాకుమారుడిగా ఎంపికైన రవికి బిగ్‌బాస్‌ హౌస్‌లో పట్టాభిషేకం జరిగింది. 'బాహుబలి'లో పట్టాభిషేక సన్నివేశాన్ని తలపించేలా సీన్‌ రీక్రియేట్‌ చేయడం కాస్త ఓవర్‌ అనిపించింది. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన సన్నీ వెంటనే ఆ బాధ నుంచి తెరుకుని రవి పట్టాభిషేకానికి హాజరై ఉత్సాహాంగా కనిపించాడు. రాకుమారుడి సింహాసనం పక్కనే నిల్చొని తాను బాహుబలినని.. భళ్లాలదేవుడికి పట్టాభిషేకం అవుతుందని.. ఆ సీన్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడం నవ్వులు పూయించింది. సన్నీ టీమ్‌లోని సభ్యులు కూడా అలాగే ప్రవర్తించారు.

చిన్నోడు పెద్దొడులా మారిన రవి-షణ్ముఖ్‌

పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రవి-షణ్ముఖ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పట్టాభిషేకం అనంతరం హౌస్‌లోకి వెళ్తున్న రవి(bigg boss telugu ravi)కి షణ్ముఖ్‌ ఎదురయ్యాడు. 'ఏరా నాతో మాట్లాడవా.. నా మీద కోపమా?' అని రవి అనగా.. అదేమి లేదు అన్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి ముందుకు వెళ్లిపోయాడు షణ్ముఖ్‌. 'ఎవరో చెప్పినవి ఎక్కించుకోవద్దు. నాతో మాట్లాడు' అని రవి అనగా.. 'నాకెందుకు కోపం అయినా ఎవరు ఏం చెబుతారు' అంటూ షణ్ముఖ్‌ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో మహేశ్‌బాబులా ఫీలయ్యాడు. షణ్ముఖ్‌(bigg boss telugu shanmukh jaswanth) ఇలా అన్నాడని రవి విశ్వతో చెప్పగా అతను.. 'నీ తమ్ముడ్ని గేటు బయటపెట్టు' అని సలహా ఇచ్చాడు.

ప్రియాకు బిగ్‌బాస్‌ గోల్డెన్‌ ఛాన్స్..

ప్రియ

రాకుమారుడిగా రవి గెలవగా ఆయన టీమ్‌లో తనతోపాటు ముగ్గురు సభ్యులను కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకోవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో పోటీలోకి అనీ మాస్టర్‌, శ్వేతావర్మ, హమీదాలు వచ్చారు. తనకు కూడా పోటీ చేయాలని ఉందని విశ్వ చెప్పినా.. చివరికి రవి చెప్పిన మాటకే కట్టుబడ్డాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ఎవరు ఊహించని మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. గతంలో పవర్‌ రూమ్‌లోకి వెళ్లే అవకాశం పొందిన హమీదను ఈ సీజన్‌ మొత్తానికి కెప్టెన్‌ పోటీల్లో నిలబడకుండా ఎవరిని ఎంచుకుంటారని బిగ్‌బాస్‌ అడగ్గా.. ఆమె ప్రియ పేరు చెప్పింది. అప్పటి నుంచి ప్రియ(bigg boss telugu priya) ఏ కెప్టెన్సీ పోటీలోనూ అర్హత సాధించలేదు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఆమెకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. రవి టీమ్‌ నుంచి ఎవరైనా తప్పుకొని.. ఆమెకు అవకాశం ఇవ్వొచ్చని.. అలాగే ఈ సీజన్‌లో కెప్టెన్‌ పోటీ జరిగిన ప్రతిసారీ ఆమె నేరుగా పోటీలో ఉంటారని తెలిపాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా రవి తాను తప్పుకొంటానని చెప్పాడు. తన కారణంగానే ప్రియ కెప్టెన్సీ పోటీలో నిలబడే అర్హత కోల్పోయిందని.. కాబట్టి ఇప్పుడు తానే పోటీ నుంచి తప్పుకొంటానని హమీద చెప్పింది. దీంతో, కెప్టెన్సీ పోటీదారులుగా ప్రియ, శ్వేతావర్మ, అనీ మాస్టర్‌, రవిలు బరిలో ఉన్నారు.

కెప్టెన్సీ టాస్క్‌ పది వేళ్లు సరిపోవు సోదరా..

ఇంటికి కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవడం కోసం బిగ్‌బాస్‌ పది వేళ్లు సరిపోవు సోదరా అనే టాస్క్‌ ఇచ్చాడు. నాలుగు డబ్బాల నిండా నీళ్లు పోసి.. బిరడాలతో వాటికున్న రంధ్రాలను మూసి వేశారు. సైరన్‌ మోగినప్పుడల్లా.. ప్రతి డబ్బాకి రెండేసి చొప్పున బిరడాలను తీసివేస్తారని.. ఏ పోటీ దారుడైతే.. ఎక్కువ నీళ్లు పోకుండా కాపాడతాడో అతను కెప్టెన్‌ అవుతాడని బిగ్‌బాస్‌ తెలిపారు. ఈ టాస్క్‌లో షణ్ముఖ్‌ను సంచాలకుడిగా ఎంపిక చేశాడు. ఈ టాస్క్‌లో గెలిచి ఎవరు కెప్టెన్‌ అవుతారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌(bigg boss telugu season 5 episode) చూడాల్సిందే.

ఇవీ చూడండి: MAA Elections: 'చీకటి యుగంలో బతుకుతున్నారా?'

ABOUT THE AUTHOR

...view details