తెలంగాణ

telangana

2021లో తెరపై కనిపించని అగ్రతారలు- మురిపించేది.. వచ్చే ఏడాదే

By

Published : Dec 21, 2021, 7:26 AM IST

వాయిదాల పద్ధతిలో కరోనా భయపెట్టినా.. మన చిత్రసీమ మాత్రం వెనకడుగు వేయలేదు. మన ప్రేక్షకుడిలో సినీ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో విడుదలైన సినిమాలు ఎక్కువే. లాక్‌డౌన్‌ వల్ల మధ్యలో మూడు నెలలు పోయినా ఈ ఏడాదిలో డిసెంబర్‌ ఆరంభం నాటికి 165 సినిమాలు విడుదలయ్యాయి. ఓటీటీ వేదికల నుంచి పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పట్టాలెక్కిన కొత్త సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. కరోనాతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు అగ్ర తారలు.. ఇటు యువ కథానాయకులు పోటాపోటీగా సినిమాలు చేశారు. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కొన్ని మాత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దాంతో పలువురు అగ్ర తారలు ఈ ఏడాది తెరపై కనిపించలేదు. కానీ ఆ తారలందరూ వచ్చే ఏడాదిపై బోలెడన్ని ఆశలు పెంచుతున్నారు.

radhe shyam
mahesh babu upcoming movie

2020లో తొలి దశ కరోనా వల్ల ఆ ఏడాది సినిమా క్యాలెండర్‌ మొత్తం మారిపోయింది. చిత్రీకరణలు ఆగిపోయాయి. విడుదల తేదీలు మారిపోయాయి. ఆ ఒత్తిడంతా 2021పై పడింది. విడుదల కోసం సినిమాలు పోటీపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా విడుదల తేదీల్ని ప్రకటించారు. అంతలోనే రెండో దశ కరోనా మొదలు కావడం వల్ల మరోమారు ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. దాంతో అగ్ర తారల సినిమాలు దాదాపు మరోమారు వాయిదా పడిపోయాయి. అలా 2021లో విడుదలలేవీ లేకుండా ఆ డైరీకి స్వస్తి చెబుతున్నారు పలువురు స్టార్‌ కథానాయకులు.

చిరు.. ప్రకటనల జోరు..

'ఆచార్య'

2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి వెండితెరపై కనిపించలేదు. 'ఆచార్య' రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది. ఈ ఏడాది ఆ సినిమా విడుదల పక్కా అనుకున్నారంతా. కానీ 2022 ఫిబ్రవరి 4కి మారింది. దాంతో వరుసగా రెండేళ్లు సినిమాల విడుదలలే లేనట్టైంది. అయితే ఈ రెండేళ్ల కాలంలో కొత్త సినిమాల ప్రకటనలతో అభిమానుల్లో జోష్‌ని నింపుతూ వస్తున్నారు. 'ఆచార్య', 'గాడ్‌ఫాదర్‌', 'భోళా శంకర్‌'తోపాటు... యువ దర్శకులు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. రానున్న రెండేళ్లల్లో చిరు సినిమాలు ఒకదానివెంట మరొకటి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఎన్టీఆర్​.. మూడేళ్లు..

'ఆర్​ఆర్​ఆర్​'లో తారక్

ఎన్టీఆర్‌ తెరపై కనిపించక మూడేళ్లయింది. 2018లో వచ్చిన 'అరవింద సమేత' తర్వాత ఆయన ప్రయాణం దాదాపు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతోనే సాగింది. మధ్యలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' చేసి బుల్లితెరపై సందడి చేశారు. జనవరి 7న విడుదల కానున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఆయన సందడి చేయనున్నారు. ఎక్కువ విరామమే వచ్చినా అందుకు తగ్గట్టే ఆయన మురిపించబోతున్నారని 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి.

రెండేళ్ల తర్వాత చరణ్..

'ఆర్​ఆర్​ఆర్​'లో చరణ్

మరో కథానాయకుడు రామ్‌చరణ్‌ తెరపై కనిపించక కూడా రెండేళ్లయింది. 2019లో 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన ఎక్కువ సమయం 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసమే కేటాయించారు. మధ్యలో 'ఆచార్య' కూడా చేశారు. ఈ సినిమాలు వరుసగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అభిమానులకి అదో డబుల్‌ ధమాకా. మరోపక్క శంకర్‌ దర్శకత్వంలో సినిమాని కూడా పట్టాలెక్కించారు రామ్‌చరణ్‌.

మహేశ్ కూడా..

'సర్కారు వారి పాట'లో మహేశ్

2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో సందడి చేసిన మహేష్‌బాబు.. ఆ తర్వాత సినిమాని పట్టాలెక్కించడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఎంత ఆలస్యమైనా 2021లో ఆయన సినిమా పక్కాగా వస్తుందని ఆశించారంతా. కానీ సాధ్యం కాలేదు. 2022 వేసవిలోనే 'సర్కారు వారి పాట'తో సందడి చేస్తారు.

రెండేళ్లుగా విడుదలలు లేని ప్రభాస్..

'రాధేశ్యామ్'

ప్రభాస్‌కి కూడా వరుసగా రెండేళ్లు విడుదలలు లేవు. 'సాహో' తర్వాత ఆయన సినిమాలతో బిజీ బిజీగానే గడుపుతున్నారు. 'రాధేశ్యామ్‌' ఈ ఏడాదే విడుదలవుతుందనుకున్నా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుంది. 'సలార్‌', 'ఆదిపురుష్‌' చిత్రాలు కూడా 2022లోనే రానున్నాయి.

'లైగర్'

యువ హీరోల్లో విజయ్‌ దేవరకొండ కూడా ఈ ఏడాది తెరపై కనిపించలేదు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 25న 'లైగర్‌'తో ఆయన సందడి చేయనున్నారు.

'గని'లో వరుణ్

వరుణ్‌తేజ్‌ కూడా 2019లో చేసిన 'గద్దలకొండ గణేష్‌' తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. వచ్చే ఏడాదే ఆయన చిత్రాలు 'గని', 'ఎఫ్‌3'లు రానున్నాయి.

ఇవీ చూడండి:

Ram charan Ntr RRR: 'ఆర్ఆర్ఆర్' కోసం చరణ్ తారక్ ఇలా..

సమంత స్పెషల్ సాంగ్ రచ్చ.. 100 మిలియన్​ వ్యూస్​తో సెన్షేసన్

'హరిహర వీరమల్లు' షూటింగ్ అప్డేట్.. 'యశోద'లో మరో స్టార్

ABOUT THE AUTHOR

...view details