కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది కీర్తి సురేశ్. 'మహానటి'తో అందరి మెప్పు పొందిన ఆమె ప్రస్తుతం పూర్తి కమర్షియల్ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలీవుడ్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం 'మిమి'. కృతిసనన్ కీలక పాత్రలో లక్ష్మణ్ ఉత్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో కృతిససన్ నటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇందులో భాగంగా కృతిసనన్ పాత్ర కోసం కీర్తిని సంప్రదించారట. స్క్రిప్ట్ విన్న కీర్తి సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదట.