ఆరు దశాబ్దాల పారాలింపిక్స్ చరిత్రలో ఇంతవరకు ఇండియా సాధించిన పతకాలు పట్టుమని పన్నెండు. దిగ్విజయంగా ముగిసిన తాజా టోక్యో విశ్వ దివ్యాంగ క్రీడా సమరంలో భారతీయ ఆటగాళ్లు ఒడిసిపట్టినవి పందొమ్మిది! అచంచల ఆత్మవిశ్వాసం, గెలిచి తీరాలన్న తపనకు కఠోర సాధన జతకలిస్తే విజయం తథ్యమని నిరూపించిన క్రీడాకారులపై ఆసేతుహిమాచలం అభినందనల వర్షం కురుస్తోందిప్పుడు. గతానికి భిన్నంగా 54 మందితో టోక్యో బరిలోకి దిగిన భారత బృందంపై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోటీపడుతున్న తొమ్మిది క్రీడాంశాల్లో కనీసం 15 పతకాలు సాధిస్తారని కథనాలు వెలువడ్డాయి. అందరి ఆశలకు మించి రాణించిన ఆటగాళ్లు- అయిదు స్వర్ణాలతో సహా 19 పతకాలను కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించారు.
అలా ఆరంభమైంది...
టేబుల్ టెన్నిస్లో భవీనాబెన్ పటేల్ రజత పతకాన్ని గెలుచుకోవడంతో ఇండియా విజయ ప్రస్థానం ఆరంభమైంది. ఆపై షూటింగ్లో అవని లెఖరా ప్రపంచ రికార్డును సమం చేస్తూ పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. జావెలిన్త్రో, బ్యాడ్మింటన్, షూటింగ్లలో సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్ బంగరు పతకధారులయ్యారు. షూటింగ్ రేంజిలో తమ గురికి తిరుగు లేదని చాటుతూ అవని, సింగ్రాజ్ అధానాలు చెరో రెండు పతకాలను చేజిక్కించుకొన్నారు. పారాలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్లో విశేషంగా రాణించిన ఇండియా- అథ్లెటిక్స్లోను ఘన విజయాలను నమోదుచేసింది. అయిదేళ్ల క్రితం రియో పోటీలతో పోలిస్తే పతకాల పట్టికలో చాలా ముందుకొచ్చి 24వ స్థానాన్ని సాధించింది. పసినాళ్లలోనే పోలియో వంటి వ్యాధుల కోరల్లో చిక్కినా, ఎదిగిన వయసులో తీవ్ర ప్రమాదాలకు గురై దివ్యాంగులైనా- చెక్కుచెదరని ఆత్మస్థైర్యంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన విజేతల అపూర్వగాథలన్నీ అద్వితీయ స్ఫూర్తిపాఠాలే. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారితో పోలిస్తే బతుకు చీకట్లను ఛేదించుకొంటూ, మరింత క్రీడాస్ఫూర్తి, పట్టుదల కనబరుస్తూ పారాలింపిక్స్లో పోటీపడ్డ వారందరూ- క్రికెట్ దిగ్గజం సచిన్ అభివర్ణించినట్లు నిజజీవిత హీరోలే!