తెలంగాణ

telangana

LORD GANESHA: అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడు

By

Published : Sep 10, 2021, 6:37 AM IST

ప్రథమ పూజ్యుడు, పరిపూర్ణ దివ్యతత్త్వ స్వరూపుడు- మహాగణపతి. ప్రకృతీ పురుషులకు పార్వతీ పరమేశ్వరులు సాకార రూపం. వారిరువురి ఏకత్వమే గణపతి. సమస్త దేవతాగణానికి, సకల మంత్ర సమూహానికి గణేశుడు అధినాయకుడు. అఖిల జగత్తు గణమయం.

LORD GANESHA
గణపతి

జగపతి అయిన ఈశ్వరుడి శక్తే గణపతిగా ఆకృతి దాల్చింది. ‘గణ’ అనే శబ్దంలో ‘గ’కారం సగుణత్వానికి, ‘ణ’ కారం మనసు, మాటలకు అందరి పరతత్త్వానికి సంకేతాలు. అ, ఉ, మ అనే అక్షరాల మేలు కలయికతో ‘ఓంకారం’ ప్రభవించింది. సృష్టి స్థితి లయలను సత్త్వరజస్తమో గుణాలను, త్రికాలాలను, త్రిలోకాలను ఆ మూడు అక్షరాలు సూచిస్తాయి. మూడక్షరాల సగుణ రూపధారిగా, ఓంకార నాదానికి ప్రతీకాత్మకంగా వేదం గణపతిని ప్రస్తావించింది. సంపద, శక్తి, జ్ఞానం, ఆనందమనే చతుర్విధ మహా ఫలితాలకు వినాయకుడు అధిష్ఠాన దైవం.

అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడిగా గణపతిని ముద్గల పురాణం అభివర్ణించింది. బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు సైతం తమ విశ్వనిర్వహణ కార్యాలకు ఆరంభంగా గణపతిని పూజిస్తారని శివమహాపురాణం పేర్కొంది. అనంతమైన ఆకాశ తత్త్వానికి ప్రతిఫలనం గణపతి. నాదాత్మక స్థితికి ఆకాశం ఆలంబన. అందుకే గణేశమూర్తిని శబ్దబ్రహ్మగా, నాదాత్మక పరమాత్మగా తైత్తిరీ యోపనిషత్తు ప్రకటించింది. మంత్రశాస్త్ర రీత్యా గణాధ్యక్షుడు, మహా కాయుడైన దశభుజ గణపతిగా విరాట్‌ రూపంలో అభివ్యక్తమయ్యాడు. దేవతా శక్తుల సమన్వయ రూపంలో తేజరిల్లుతూ తన పది చేతుల్లో వివిధ దేవతలకు సంబంధించిన ఆయుధాల్ని విశ్వనాయకుడై వినాయకుడు ధరిస్తాడు. వక్రతుండంపై రత్న కలశం లక్ష్మీప్రదమైన లక్షణ శక్తికి ప్రతిఫలనం. ఏకదంతుడైన స్వామి రూపం అద్వైత భావానికి ఆకృతి దాల్చిన మూర్తిమత్వం. ‘ఏక’ శబ్దానికి ప్రధానం అని అర్థం. ‘దంత’ శబ్దం బలవాచకం. సర్వోత్కృష్టమైన బలశాలిగా ఏకదంత గణపతి ఆవిష్కారమయ్యాడు.

జగన్మాత దివ్య తేజో రూపుడు..

గణపతిని శ్రీకృష్ణ అవతారంగా బ్రహ్మవైవర్త పురాణం వర్ణించింది. పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరించి, గోలోక నివాసియైన కృష్ణుణ్ని వరపుత్రుడిగా కోరుకుందని, ఫలితంగా కృష్ణుడే గణపతిగా ఆవిర్భవించాడని పురాణ గాథ. పరమేశ్వరుడే గణేశ్వరుడిగా సాకారమయ్యాడని గణేశ పురాణం వివరించింది. శక్తి అంశ అయిన నలుగు పిండితో వ్యక్తమైన శక్తిత్వ పుత్రుడిగా, జగన్మాత దివ్య తేజో రూపుడిగా హేరంబోపనిషత్తు పార్వతీ నందనుణ్ని ప్రస్తుతించింది.
గణపతిని తొమ్మిది రాత్రులతో కూడిన కాలగణనతో ఉత్సవ నేపథ్యంగా ఆరాధిస్తారు. నవావరణలకు ఆవల ఉండే భగవచ్ఛక్తిని ఉపాసనతో దర్శించడానికి నిర్వహించే అర్చనా ప్రక్రియల సమాహారమే- గణేశ నవరాత్రులు.

గణపతి పూజలో ఏకవింశతి అనగా ఇరవై ఒక్క పత్రాల్ని వినియోగిస్తాం. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, సాధకుడి మనసు- ఇవన్నీ కలిపితే మొత్తం ఇరవై ఒకటి. వీటి సమ్మేళనంతో కూడిన దేహమనే దేవాలయంలోకి గణపతిని ఆవాహన చేసుకోవడమే పత్రిపూజలో పరమార్థం. దైవత్వం, ద్రవ్యం, మంత్రం, క్రియాత్మకం- ఈ నాలుగింటితో కూడినదే యజ్ఞం. చతుర్వేదాల రూపుడిగా, యజ్ఞమూర్తిగా, చతుర్భుజుడిగా గణపతి వర్ధిల్లుతున్నాడు. అందుకే నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన ‘చవితి’ నాడు షోడశోపచారాలతో విఘ్నరాజును ఆరాధిస్తున్నాం. పురాణాల రీత్యా గణపతి ఆవాసం- ఆనంద భువనం. ఈ భువనం చుట్టూ చెరకు రసాల కడలి ఆవృతమై ఉంటుంది. అందుకే మధుర మనోజ్ఞ ఆనంద రసమూర్తిగా గణేశుడు ప్రకాశిస్తూంటాడు.

ఇదీ చూడండి:Ganesh chaturthi: చరిత్ర పుటల్లో వినాయక చతుర్థి.. శివాజి నుంచి తిలక్​ వరకు ప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details