తెలంగాణ

telangana

ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

By

Published : Jan 15, 2021, 10:15 AM IST

భూకంపాల గడ్డ ఇండోనేషియాను మరో భారీ భూకంపం కుదిపేసింది. ఈ తెల్లవారుజామున సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం ధాటికి ఏడుగురు మృతిచెందగా.. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. రిక్టర్ ‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది.

Earthquake
ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం తెల్లవారుజామున సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింది అనేక మంది చిక్కుకుపోయారు.

స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి కనీసం 60 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్‌ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి నేలమట్టం..

భూకంపం తీవ్రతకు పలు నివాస సముదాయాలతో పాటు హోటళ్లు, ఓ ఆసుపత్రి నేలమట్టమయ్యాయి. ఆసుపత్రి కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు రోగులు, హాస్పిటల్‌ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో పలుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌' ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:ప్రయాణికులంటే ఈ చిరుతకు ఎంత ప్రేమో

ABOUT THE AUTHOR

...view details