తెలంగాణ

telangana

పాముకాటుకు అర్చకుడు బలి.. పట్టుకునేందుకని వెళ్లి..!

By

Published : Sep 26, 2022, 1:07 PM IST

Snake Bite: పామును పట్టేందుకు వెళ్లి దాని కాటుకు గురై ఓ అర్చకుడు ప్రాణం విడిచిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. దసరా ఉత్సవాల కోసం వెళ్లిన వ్యక్తి.. విగత జీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే..?

priest dies
పూజారి మృతి

SNAKE BITE: పామును పట్టుకోవడానికి వెళ్లి, అది కాటు వేయడంతో మరణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో చోటుచేసుకుంది. కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబుశర్మ(48) తండ్రి నుంచి వచ్చిన పౌరహిత్యాన్ని వారసత్వంగా తీసుకున్నారు. ఆయన గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. దసరా సందర్భంగా కృత్తివెన్నుకు వచ్చారు. గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని నివాసాలకు దూరంగా వదిలివేసే అలవాటు ఉండటంతో కృత్తివెన్ను పీతలావ గ్రామానికి చెందిన రైతులు కొండూరు నాగబాబుశర్మను శనివారం మధ్యాహ్నం పామును పట్టుకోవడానికి తీసుకు వెళ్లారు.

పట్టుకున్న పామును నివాసాలకు దూరంగా తరలించే సమయంలో చేతిపై కాటువేయడంతో ఆయన ఇంటివద్దే ప్రథమ చికిత్స చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతసేపటికి పరిస్థితి విషమించడంతో సమీపంలోని చినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈమేరకు కుటుంబ సభ్యులు సొంతకారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే మరణించారు.

ఎంతోమందికి పాముకాటు బారినుంచి రక్షించిన ఆయన అదే పాము కాటుతో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబుశర్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం గుడిదిబ్బలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details