తెలంగాణ

telangana

మర్రి శశిధర్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషేనన్న రేణుకాచౌదరి

By

Published : Aug 18, 2022, 5:21 PM IST

Renuka Chaudhary

Renuka Chaudhary on Marri Shasidhar Reddy Issue తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో రేణుకాచౌదరి సమావేశమయ్యారు. సీనియర్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆవేదనలో మాట్లాడారని, ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ మనిషే అని రేణుకాచౌదరి అన్నారు.

Renuka Chaudhary on Marri Shasidhar Reddy Issue: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూరే కారణమంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. కాంగ్రెస్​లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో ఆమె సమావేశమయ్యారు. మర్రి శశిధర్‌రెడ్డి సమస్య సర్దుకుంటుందని.. ఆవేదనలో అలా మాట్లాడారని ఆమె అన్నారు. శశిధర్‌ రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తిగా పేర్కొన్న ఆమె... ఆయనకు మనసులో ఏదో బాధ అనిపించి అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

'మర్రి శశిధర్ రెడ్డి ఆవేదనలో మాట్లాడారు. ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ మనిషే. రేవంత్ రెడ్డితో పాటు అందరు సర్దుకుని ముందుకు పోవాలి. ఆరోపణలు వస్తునే ఉంటాయి. మునుగోడులో విజయం మాదే.'-రేణుకా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి

రేవంత్ రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని రేణుకా చౌదరి తెలిపారు. పార్టీలో తమను అవమానించేవారెవరూ లేరని... అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసునని పేర్కొన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే వారు లేరని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం బాధకరమేనని... మునుగోడులో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపాలోనూ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని వివరించారు.

అంతకుముందు బుధవారం మర్రి శశిధర్‌ రెడ్డి.. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణికం ఠాగూర్‌.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు.

మర్రి శశిధర్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషేనన్న రేణుకాచౌదరి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details