‘ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన 1400 మంది కుటుంబాలు కేసీఆర్ పాలన చూసి రోదిస్తున్నాయి. నిరుద్యోగులు, రైతులు... ఇలా రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న తెలంగాణ?’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలించేందుకే పాదయాత్ర చేపట్టానని ఉద్వేగంగా చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఇదే నాంది కానుందన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కాషాయదళం హర్షాతిరేకాల మధ్య సంజయ్ ‘ప్రజా సంగ్రామ’ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకుని ఆయన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, దిల్లీ నుంచి వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో పాటు.. రాష్ట్రం నుంచి అన్నిస్థాయుల నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. హోరెత్తించే నినాదాలు, ఎగసిపడుతున్న శ్రేణుల ఉత్సాహం నడుమ 35 రోజుల మొదటి విడత పాదయాత్రలో సంజయ్ తొలి అడుగు వేశారు. వర్షంలోనూ ముందుకు సాగుతూ తొలిరోజు మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు.
నా యాత్రతో ప్రకంపనలు తథ్యం
యాత్ర ప్రారంభ సందర్భంగా చార్మినార్ వద్ద నిర్వహించిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. తెరాస, మజ్లిస్లే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘ఇంటికో ఉద్యోగం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీలను కేసీఆర్ మరిచారు. సీఎం అలా ఒక్కొక్కరికి రూ.లక్ష బాకీ పడ్డారు. డిగ్రీ, పీజీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. 25 లక్షల మంది డీఎస్సీ కోసం, 40 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజిలో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. నిరుద్యోగులు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గొర్రెలు, బర్రెలు బీసీలకు.. పాలనా పగ్గాలు కేసీఆర్కా? భాగ్యలక్ష్మి అమ్మవారి కనుసన్నల్లో సాగుతోన్న ఈ యాత్ర తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం’ అని ఆయన ఆవేశంగా ప్రసంగించారు. మతపరమైన రిజర్వేషన్లు అడ్డుపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతూ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది మహిళలకు మంత్రి పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వేళ దొంగ హామీలిచ్చి.. తర్వాత ఫామ్హౌస్కు పరిమితమయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు సాగనంపాలన్నారు.
తాలిబన్ భావజాలాన్ని తరిమి కొట్టాలి
తాలిబన్ భావజాలమున్న మజ్లిస్ పార్టీని, దానికి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భాజపా లక్ష్యం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు. ‘రంజాన్ వస్తే ఇఫ్తార్ విందు, క్రిస్మస్కు భోజనాలు పెట్టడాన్ని భాజపా సమర్థిస్తుంది. కానీ హిందువుల పండుగలు తెరాసకు పట్టకపోవడం బాధాకర’మన్నారు. గణేశ్ శోభాయాత్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద స్వాగతం పలకాలని డిమాండ్ చేశారు. భాజపా ఏ వర్గానికీ, మతానికీ వ్యతిరేకం కాదని.. 80 శాతం ఉన్న హిందువుల పరిరక్షణకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. పాతబస్తీ నుంచి వెళ్లిపోయిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ‘ఎంఐఎం నాయకులు, అవినీతి నియంత కేసీఆర్ గుండెలు బద్దలయ్యేలా నినదించాల’ంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘భారత్మాతాకీ జై.. జై శ్రీరామ్, వందేమాతరం, రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్కీ.. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం’ అంటూ సంజయ్ చేసిన నినాదాలకు కార్యకర్తల గొంతులు తోడవడంతో సభా ప్రాంగణం హోరెత్తింది.
రావణరాజ్యాన్ని అంతమొందిద్దాం : తరుణ్చుగ్
ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో రావణరాజ్యం సాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చుగ్, అరుణ్సింగ్ తమ ప్రసంగాల్లో విమర్శించారు. మహాత్మాగాంధీ యాత్రతో ఆంగ్లేయుల పాలన.. మిషన్ పోలోతో నిజాం పాలన.. ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రతో సీఎం కేసీఆర్ పాలన అంతమవుతుందని తరుణ్చుగ్ అన్నారు. కేంద్రం తెలంగాణకు 3 లక్షల ఇళ్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం లక్ష కూడా నిర్మించలేదని అరుణ్సింగ్ ఆరోపించారు. భవిష్యత్తులో ‘తెరాస జానేవాలా.. భాజపా ఆనేవాలా’ తథ్యమన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రభుత్వం భాజపాతోనే సాధ్యమన్నారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ ఫామ్హౌస్లో బందీ అయ్యాయని దుయ్యబట్టారు.
నేటి యాత్ర సాగుతుందిలా..