తెలంగాణ

telangana

మందగమనంలో ప్రపంచం.. వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్.. వాటిమీదే నిర్మలమ్మ ఫోకస్!

By

Published : Jan 31, 2023, 1:48 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన.. వరసగా అయిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా భారీ లెక్కలతో, అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపే కేంద్ర బడ్జెట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సారి నిర్మలమ్మ తీసుకొచ్చే బడ్జెట్‌ ఏఏ రంగాలపై దృష్టిసారించనుంది? ప్రపంచ దేశాలను మాంద్యం పరిస్థితులు భయపెడుతున్న వేళ రానున్న బడ్జెట్‌ ఎలా ఉండనుంది. ద్రవ్య లోటును పూడ్చేందుకు బడ్జెట్‌లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలను తీసుకోనుంది? ఈ విశ్లేషణాత్మక కథనంలో చూద్దాం.

union-budget-2023
union-budget-2023

ఆర్థిక మందగమనంతో అమెరికా సహా పలు దేశాలు అల్లాడుతున్నవేళ ఆ ప్రభావం భారత్‌పైనా పడనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సవాళ్లను అధిగమిస్తూ దేశీయ అవసరాలను తీర్చేలా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. భారత్‌లోనూ ఆర్థిక వృద్ధి నెమ్మదించినట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే చర్యలతో పాటు, వివేకవంతమైన మార్గాలను బడ్జెట్‌లో అనుసరించాల్సిన అవసరం కేంద్ర ముందు ఉంది. డిమాండులో అనిశ్చితులు, ఎగుమతి మందగమనం కారణంగా ప్రైవేటు రంగ పెట్టుబడిదారులకు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి, బడ్జెట్‌లో వారికి మూలధన సాయాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది.

ప్రస్తుతం ఐరోపా, చైనా, అమెరికా వంటి దేశాల్లో పారిశ్రామిక వృద్ధి రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రపంచ దేశాల్లో మాంద్యం పరిస్థితులు, కరోనా విజృంభణ కుదిపేస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా సాగుతుండటం హర్షణీయం. ఇటీవల ఇండియా వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు గతంలో ప్రకటించిన 6.7శాతం నుంచి 6.9శాతానికి పెంచింది. పూర్తిస్థాయిలో ఏడు శాతం వృద్ధిరేటుపై కేంద్రం భరోసాగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (NSO) సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఏడుశాతం వృద్ధిరేటు సాధిస్తుందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధిరేటు 6.8శాతం ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. మరోవైపు, పన్ను రాబడి పెరగడమూ సానుకూల పరిణామం.

ద్రవ్యలోటుపై దృష్టి..
ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగినందున కేంద్రం ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటుపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ద్రవ్యలోటును 5.5శాతం నుంచి 5.8శాతం మధ్య ఉంచేందుకు కొన్ని కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. వృద్ధికి ఊతం ఇచ్చే భారీ మౌలిక సదుపాయాలపై మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. రైల్వేలు, జాతీయ రహదారులు, విద్యుత్‌, హౌసింగ్, పట్టణ రవాణా, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రోత్సహించడం ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధిని పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.

రాబోయే బడ్జెట్‌లో కేంద్రం గ్రామీణాభివృద్ధి పెద్దపీట వేయనున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్‌ యోజన, జాతీయ జీవనోపాధి మిషన్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన వంటి కీలక గ్రామీణ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్‌ ద్వారా కేంద్రం అండగా నిలిచే అవకాశముంది. ముఖ్యంగా వాటి కోసం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ (ECLGS)ను మరో ఏడాది పొడగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే, MSMEల కోసం లోన్ రీపేమెంట్ వ్యవధిని 90 రోజుల నుండి 180 రోజులకు పొడిగించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details