రెపో రేటుపై ఆర్బీఐ(RBI) నిర్ణయాలు, మే నెలకు సంబంధించిన ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్లకు(Stock Market) ఈ వారం కీలకం కానున్నాయంటున్నారు విశ్లేషకులు.
'మే నెలకు సంబంధించి స్థూల ఆర్థిక గణాంకాలు, 2021 మొదటి త్రైమాసిక జీడీపీ(GDP) డేటా, తయారీ, సేవా రంగాల పీఎంఐ లెక్కలు ఈ వారమే విడుదలవనున్నాయి. స్టాక్ మార్కెట్లపై(Stock Market) వీటి ప్రభావం కీలకంగా ఉండనుంద'ని రెలిగేర్ బ్రోకింగ్ ఉపాధ్యక్షుడు (పరిశోధనా విభాగం) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. వీటికి తోడు వాహన విక్రయ గణాంకాలు, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలు మార్కెట్లను ముందుకు నడిపించే కీలక అంశాలని వివరించారు. రెపో రేటు సహా సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించనున్నారు.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు (Covid Cases) కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్రాల్లో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి ఇవి సానుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.
వీటన్నింటికి తోడు.. రూపాయి హెచ్చుతగ్గులు, ముడి చమురు ధర, విదేశీ మదుపరుల సెంటిమెంట్, కరోనా వ్యాక్సిన్(Covid Vaccine) వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.