తెలంగాణ

telangana

IPL బెట్టింగ్​లో లాస్.. అప్పులు తీర్చలేక సూసైడ్​.. మనస్తాపంతో తల్లి కూడా..

By

Published : May 24, 2023, 10:12 AM IST

Youth commits suicide

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడి అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి చావును చూసి తట్టుకోలేకపోయింది అతడి తల్లి. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై.. అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, ఓ కార్గో ట్రక్కు డ్రైవర్.. ఓ వ్యక్తిని హత్య చేసి తల, మొండెన్ని వేరుచేశాడు. అనంతరం తన ట్రక్కులోనే రాత్రంతా మృతదేహాన్ని పెట్టుకుని తిరిగాడు.

క్రికెట్ బెట్టింగ్​లో అప్పులపాలైన ఓ యువకుడు(20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణాన్ని చూసి అతడి తల్లి తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో ఆమె కూడా చనిపోయింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో సోమవారం జరిగింది.

అసలేం జరిగిందంటే?..
ఖితాన్ వాధ్వానీ అనే యువకుడు తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి చాపర్​ నగర్​ చౌక్​ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఖితాన్ తండ్రి నరేశ్ వాధ్వానీ హోల్‌సేల్ వ్యాపారి కాగా.. తల్లి దివ్య గృహిణీ. కాగా.. ఖితాన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బాగా అలవాటు పడిపోయాడు. దీంతో ఐపీఎల్​లో బెట్టింగ్​లు వేసి డబ్బులను పోగొట్టుకున్నాడు. అంతేగాక అప్పులపాలయ్యాడు. తన ఫోన్​ను సైతం తాకట్టు పెట్టేశాడు. ఈ విషయం తల్లికి తెలియడం వల్ల ఖితాన్​ను మందలించింది. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. సోమవారం ఖితాన్ కుటుంబ సభ్యులందరూ బంధువుల వివాహం ఉందని వేరే ఊరు వెళ్లారు. అదే అదునుగా భావించిన ఖితాన్.. ఇంట్లోని వంట గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరు నుంచి తిరిగివచ్చిన ఖితాన్​ తల్లి దివ్య కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో ఆమె ఒక్కసారి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మరణించిన తల్లి దివ్య
ఆత్మహత్య చేసుకున్న ఖితాన్

'ట్రక్కులోనే మృతదేహంతో రాత్రంతా'
ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేశాడు కార్గో ట్రక్కు డ్రైవర్. అనంతరం మృతదేహం తల, మొండెంను వేరుచేశాడు. తలలేని శరీరాన్ని ట్రక్కులో పెట్టుకుని రాత్రంతా తిరిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. సారంగడ్​ బిలాయిగఢ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిందీ దారుణం.

సర్సివా ప్రాంతంలో కార్గో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు ఉమా శంకర్ సాహు అనే వ్యక్తి. ఓ వ్యక్తిని హత్య చేసి తలను వేరుచేసి మొండెన్ని తన ట్రక్కులో తీసుకుని సోమవారం అర్ధరాత్రి స్వగ్రామానికి చేరుకున్నాడు నిందితుడు ఉమా శంకర్​. తన ఇంటి ముందు ట్రక్కును ఉంచి రాత్రి నిద్రపోయాడు. నిందితుడు తన ఇంటికి ట్రక్కులో చేరుకునేలోపు ఐదు పోలీస్ స్టేషన్​లను దాటాడు. ట్రక్కులో మృతదేహాన్ని గమనించిన కొందరు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు నిందితుడి స్వస్థలం గగోరీకి చేరుకున్నారు. నిందితుడు ఉమా శంకర్​ను అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అయితే ఉమా శంకర్​ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎలాగోలా కష్టపడి కాసేపటికి నిందితుడు ఉమా శంకర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉమా శంకర్ కరుడుగట్టిన నేరస్థుడని పోలీసుల తెలిపారు. అంతకుముందు ఓ కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్​పై జైలు నుంచి విడుదలయ్యాడని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details