తెలంగాణ

telangana

సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

By

Published : Mar 13, 2022, 11:15 AM IST

UP Polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు హిందుత్వం, రామ మందిరం వంటి అంశాలను కాకుండా.. సంక్షేమాన్ని చూసి ఓటు వేసినట్లు ది లోక్​నీతి-సీఎస్​డీఎస్​ సంస్థలు నిర్వహించిన పోస్ట్​ పోల్​ సర్వేలో వెల్లడైంది. మరోమారు ప్రధాని మోదీ మేజిక్​ పనిచేసిందని, రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ప్రజలు ఎక్కువ సంతృప్తితో ఉన్నట్లు అధ్యయనం తేల్చింది.

PM Modi
ప్రధాని మోదీ

UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు రామమందిరం, హిందుత్వ వంటి అంశాల కంటే.. అభివృద్ధి, ప్రభుత్వ పనితీరు నచ్చే మళ్లీ భాజపాకు పట్టంగట్టారు. ఈ నెల పదో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఈ రాష్ట్రంలో 'ది లోక్‌నీతి - సీఎస్‌డీఎస్‌' సంస్థలు పోస్ట్‌ పోల్‌ సర్వే నిర్వహించాయి. రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కంటే కూడా నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ప్రజలు మూడింతలు ఎక్కువ సంతృప్తితో ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

మొత్తానికి యూపీలో భాజపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేలా 'మోదీ మేజిక్‌' బాగా పనిచేసిందని వెల్లడించింది. కులం, మతంతో ప్రమేయం లేకుండా కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఉజ్వల పథకం, పీఎం ఆవాస్‌ యోజన, ఉచిత రేషను వంటి పథకాలతో కొత్తగా పలువురు లబ్ధి పొందినట్లు సర్వే తెలిపింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కమలదళంలో ఎన్నికల ముందున్న భయాలన్నీ చెల్లాచెదురు చేస్తూ రైతులు, బ్రాహ్మణులు, ఎస్సీలు, మాయావతికి ఓటుబ్యాంకుగా ఉన్న జాటవ్‌ వర్గీయుల మద్దతు కూడా భాజపాకు పుష్కలంగా లభించింది.

భాజపాకు ముస్లిం ఓట్లు పెరిగాయి..

రాష్ట్రంలో 2017 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే.. భాజపాకు ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు.. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి హిందూ ఓట్లు 8 శాతం ఎక్కువ పోలయ్యాయి. భాజపా కూటమి తరఫున గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ముస్లిం అభ్యర్థి లేకపోయినా.. 8 శాతం ముస్లిం ఓటర్లు కమలానికి మద్దతు ఇచ్చారు. 2017 కంటే ఇది మూడు శాతం అధికం. ఈ ఎన్నికలు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి ఓ పీడకలలా మిగిలిపోతాయి. ఈ పార్టీకి గతంలో 19 శాతం ముస్లింలు అండగా నిలువగా, తాజా ఎన్నికల్లో ఆరు శాతమే మద్దతిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఇదే స్థాయిలో (19%) గతంలో మద్దతిచ్చిన ముస్లిం ఓటర్లు ప్రస్తుతం కేవలం మూడు శాతమే ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో 34 మంది ముస్లింలు శాసనసభ్యులుగా ఎన్నిక కాగా, ఇందులో 31 మంది సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారే. 2017 ఎన్నికల్లో ఈ వర్గం నుంచి 25 మంది మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి:ఉత్తరాఖండ్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?

ABOUT THE AUTHOR

...view details