తెలంగాణ

telangana

ఉగ్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు, 75ఏళ్లలో తొలిసారి

By

Published : Aug 15, 2022, 7:34 PM IST

Bastar naxalgarh Tiranga
బస్తర్​లో స్వాతంత్ర్య దినోత్సవం

ఆ రెండు గ్రామాలు భారత్​లో అంతర్భాగమే. కానీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్కడ జాతీయ జెండా ఎగరలేదు. పంద్రాగస్టు వేడుకలకు ఏనాడూ ఆ పల్లెలు వేదిక కాలేదు. అలాంటి చోట్ల 75 ఏళ్లలో తొలిసారి మువ్వెన్నల జెండాలు రెపరెపలాడాయి. భారత్​ మాతాకీ జై నినాదాలతో ఆ గ్రామాలు మార్మోగాయి.

Bastar Independence day celebrations: ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేళ అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏనాడూ పంద్రాగస్టు వేడుకలకు వేదికలు కాని గ్రామాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఉగ్రవాద దుశ్చర్యలకు, నక్సలైట్ల హింసాయుత ఉద్యమాలకు ఇప్పటివరకు నెలవైన ఆ పల్లెలు.. 75ఏళ్లలో తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవంలో భాగమయ్యాయి. ఒక గ్రామం ఛత్తీస్​గఢ్​ బస్తర్ జిల్లాలోని చందమేట కాగా మరొకటి జమ్ముకశ్మీర్ బుడ్గాంలోని సుయ్​బాఘ్.

బస్తర్​లోని చందమేటలో తొలిసారి జెండా పండుగ

'ఎర్ర' కోటలో అమృతోత్సవ స్ఫూర్తి..
చందమేట.. ఛత్తీస్​గఢ్​లోని ఓ మారుమూల గ్రామం. బస్తర్ జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లో ఉంటుందీ పల్లె. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఇక్కడ ఎప్పుడూ పంద్రాగస్టు వేడుకలు నిర్వహించలేదు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. నక్సలిజంపై పోరులో భద్రతా సిబ్బంది గణనీయమైన పురోగతి సాధించడం, వేర్వేరు కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు దగ్గరవడం ఇందుకు దోహదం చేశాయి. ఫలితంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ జెండా పండుగకు వేదికైంది చందమేట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కవర్ చేసింది ఈటీవీ భారత్.

భద్రతా సిబ్బంది సోమవారం ఉదయమే చందమేట గ్రామానికి చేరుకున్నారు. స్థానికులందరితో మాట్లాడి, దగ్గరుండి పంద్రాగస్టు వేడుకలు జరిపించారు. ఈ వేడుకతో గ్రామస్థులు ఆనందంలో మునిగిపోయారు. 'భారత్​ మాతా జై' అంటూ నినాదాలు చేశారు. తొలిసారి జెండా పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, త్రివర్ణ పతాకం ప్రాముఖ్యం ఏంటో అర్థమైందని చందమేట గ్రామస్థులు ఈటీవీ భారత్​కు చెప్పారు.

ఉగ్రనేత ఇలాఖాలో..
జమ్ముకశ్మీర్​ బుడ్గాంలోని సుయ్​బాఘ్​ సైతం ఇలాంటి కార్యక్రమానికే వేదికైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ స్వస్థలం సుయ్​బాఘ్. ఎప్పుడూ హింసాయుతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈసారి మాత్రం దేశభక్తి ఉప్పొంగింది. స్థానిక రాజకీయ నేతలు, సైనికాధికారులు, పోలీసులు, స్థానికులు అంతా కలిసి పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. భాజపా నేత అష్రఫ్​ ఆజాద్ త్రివర్ణ పతాకం ఎగరవేశారు. 75ఏళ్లలో తొలిసారి ఇక్కడ జెండా పండుగ జరపడం చాలా గొప్ప విషయమని స్థానిక అధికారులు చెప్పారు.

జెండాలను ప్రదర్శిస్తున్న మహిళలు
బుడ్గాంలో పంద్రాగస్టు వేడుకలు
పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ప్రజలు
పంద్రాగస్టు వేడుకలు

ఇవీ చదవండి:న్యాయం చేసే బాధ్యత మూడు వ్యవస్థలది, కోర్టులది మాత్రమే కాదు

దళిత విద్యార్థిని బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసిన టీచర్​, 18 గంటలు అలానే

ABOUT THE AUTHOR

...view details