ETV Bharat / bharat

'ఓటింగ్ లెక్కలు మరింత క్లియర్​గా చెప్పండి​- పోలింగ్​ జరిగిన 48 గంటల్లోపే!' - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 10:36 PM IST

Updated : May 14, 2024, 10:55 PM IST

Civil Society Delegation Letter To EC : ఓటింగ్‌ శాతం గణాంకాలను మరింత పారదర్శకంగా వెల్లడించాలని పౌర సంఘం సభ్యుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమని తెలిపింది.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024 (Source: Getty Images)

Civil Society Delegation Letter To EC : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్‌ శాతం గణాంకాలను మరింత పారదర్శకంగా వెల్లడించాలని పౌర సంఘం సభ్యుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 4,000 మందికి పైగా సంతకాలతో కూడిన లేఖను సమర్పించింది. మొదటి రెండు దశల ఎన్నికలకు సంబంధించి వెల్లడించిన గణాంకాల్లో హెచ్చుతగ్గులను లేఖలో ముఖ్యంగా హైలైట్ చేసింది.

ప్రాథమిక అంచనాలు, తర్వాత సవరణ లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయని పౌర సంఘం సభ్యుల బృందం లేఖలో తెలిపింది. ఇది ఎన్నికల ప్రక్రియ కచ్చితత్వం, పారదర్శకతకు సంబంధించి ప్రజల్లో సందేహాలు, ఆందోళనలను రేకెత్తించిందని పేర్కొంది. ఎన్నికల నియమావళి రూల్ 49Sని ప్రస్తావించింది. దాని ప్రకారం, ప్రతి పోలింగ్ స్టేషన్‌లోని ప్రిసైడింగ్ అధికారి ఫారం 17Cలోని పార్ట్ Iలో నమోదైన ఓట్ల జాబితాను సిద్ధం చేసి, పోలింగ్ ఏజెంట్లకు కాపీలను అందించాల్సి ఉంది.

ఎన్నికల సంఘం వెబ్​సైట్​లో!
అయితే ఇప్పటి వరకు పూర్తిన దశలకు సంబంధించి ఓటింగ్ జరిగిన అన్ని పోలింగ్ స్టేషన్‌ల ఫారం 17సీలోని పార్ట్ I కాపీలను అఫీషియల్ వెబ్​సైట్​లో అప్‌లోడ్ చేయడం ద్వారా పారదర్శకతను పెంపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. దేశంలో జరిగే తదుపరి దశ ఎన్నికలు ముగిసిన 48 గంటల్లోగా నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల సంఖ్యను బహిరంగంగా వెల్లడించాలని కోరింది.

ప్రజల విశ్వాసం చాలా ముఖ్యం!
"ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్‌లోని ఫారం 17C (నమోదైన ఓట్ల జాబితా) పార్ట్-1ని స్కాన్ చేసిన స్పష్టమైన కాపీని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలి. మిగిలిన దశల సమాచారాన్ని పోలింగ్ ముగిసిన 48 గంటల్లోపు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో బహిరంగంగా ప్రదర్శించాలి" అని లేఖలో పేర్కొంది.

ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకతను కోరుతూ అందించిన లేఖపై న్యాయవాదులు, సమాచార కమిషనర్లు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, షబ్నమ్ హష్మీ, అంజలీ భరద్వాజ్, ప్రశాంత్ భూషణ్, నజీబ్ జంగ్, తుషార్ ఎ. గాంధీ సహా ఇతర సభ్యులు సంతకం చేశారు. జగదీప్ చోకర్, ఎంజీ దేవసహాయం, యోగేంద్ర యాదవ్, బృందా గ్రోవర్, శైలేష్ గాంధీ, అశోక్ శర్మ, అమృత జోహ్రీ, నవశరణ్ సింగ్, జయతి ఘోష్, విపుల్ ముద్గల్ తదితరులు కూడా సంతకం చేశారు.

సొంత భూమి, ఇల్లు, కారు లేని మోదీ- అకౌంట్​లో ఎంత ఉందంటే? - PM Modi Property

రాహుల్​ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ రె'ఢీ'- యువ నేతకు ఛాన్స్- ఎవరంటే? - BJP Open Debate With Rahul

Last Updated :May 14, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.