దేశ పౌరులందరికీ ఉచిత టీకాలు పంపిణీ చేయాల్సిందిగా కోరుతూ.. 116 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉచిత టీకాల పంపిణీతో పాటు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను గణనీయంగా పెంచాలని ఈ బృందం ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం బహిరంగ లేఖ రాసింది.
కరోనా సంక్షోభంతో పాటు.. కీలక సమస్యలను పరిష్కరించకుండా.. పరిస్థితులన్నీ బాగానే ఉన్నట్లు చూపించడంపైనే ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోందని ఈ బృందం ఆక్షేపించింది.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో.. మాజీ కేబినెట్ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్తో పాటు.. మాజీ ఆరోగ్య కార్యదర్శి కే.హబీబుల్లా, దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నారు.
"కరోనా ముప్పుపై వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనల మూలంగా.. 'ఆత్మనిర్భర్ భారత్' ప్రస్తుతం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తోంది. ప్రధానమంత్రి జాతీయ విపత్తు ఉపశమన నిధి స్థానంలో పీఎం-కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేశారు. అయితే.. విరాళాలు, నిధులను ఏయే అవసరాలపై ఖర్చు చేశారో వెల్లడించలేదు."
- ప్రధాని మోదీకి రాసిన లేఖలో మాజీ ఐఏఎస్ అధికారుల బృందం.