తెలంగాణ

telangana

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము, వారిపై ప్రశంసలు

By

Published : Aug 14, 2022, 8:17 PM IST

Draupadi Murmu Address Nation భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు ముర్ము. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని అభిప్రాయపడ్డారు.

President Droupadi Murmu
ద్రౌపదీ ముర్ము

Draupadi Murmu Address Nation: 'దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయ్‌.. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నార'ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశానికి అతి పెద్ద ఆశాదీపాలు మన పుత్రికలేనన్నారు. స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రలజందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమన్నారు. " భారత్‌ 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోంది. 1947 ఆగస్టు 15న వలస పాలన సంకెళ్లను తెంచుకున్నాం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. మన స్వాతంత్ర్య సమరయోధులందరికీ వందనాలు. మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం వారంతా తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా మన మహనీయులందరినీ మరోసారి స్మరించుకుందాం. దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న స్మృతి దివస్‌ జరుపుకొంటున్నాం. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నాం" అని ఆమె అన్నారు.

''కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఈ క్లిష్ట సమయాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే భారత్‌ ఓ మార్గదర్శిలా నిలిచింది. అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టి వ్యాక్సినేషన్‌లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. అంకుర సంస్థలతో భారత్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ విధానం పెనుమార్పులు తీసుకొచ్చింది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నాం. దేశంలో స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ను చేపట్టాం. గత నెలలో 200 కోట్ల వ్యాక్సిన్‌ మార్కును అధిగమించాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌ సాధించిన విజయాలు ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువే.''

-ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి

"మన మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో పెరుగుతోన్న వారి భాగస్వామ్యం నిర్ణయాత్మకంగా మారింది. నేడు మన పంచాయతీరాజ్ సంస్థల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య పద్నాలుగు లక్షలకు పైనే. దేశం ఆశలన్నీ మన పుత్రికలపైనే ఉన్నాయి. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే గొప్ప విజయాలు సాధించగలరు. ఫైటర్‌ పైలట్‌ నుంచి అంతరిక్ష శాస్త్రవేత్త దాకా.. మన పుత్రికలు ప్రతిరంగంలోనూ విజయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు" అని ప్రశంసించారు.

ఇవీ చదవండి:మహారాష్ట్రలో భాజపాకే కీలక శాఖలు, హోం, ఆర్థిక మంత్రిగా ఫడణవీస్

జెండా ఎగురవేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా

ABOUT THE AUTHOR

...view details