తెలంగాణ

telangana

'3రాష్ట్రాల్లో బీజేపీ విజయం-2024లో హ్యాట్రిక్‌కు గ్యారంటీ- 'ఘమండియా' కూటమికి ఇదే వార్నింగ్​'

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:31 PM IST

Updated : Dec 3, 2023, 10:15 PM IST

PM Modi Elections Victory Speech : అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని ప్రధాని మోదీ తెలిపారు. మూడు రాష్ట్రాల ఎన్నికలు రానున్న లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్​కు గ్యారంటీ ఇచ్చాయని పేర్కొన్నారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Modi Elections Victory Speech
PM Modi Elections Victory Speech

PM Modi Elections Victory Speech :మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. నిజాయతీ, పారదర్శకత, సుపరిపాలనలకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మూడు విజయాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌కు గ్యారంటీ ఇచ్చాయని తెలిపారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుంధబి మోగించిన నేపథ్యంలో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించారు. కాషాయదళంపై ప్రేమను కురిపించినందుకుగానూ మూడు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.

తెలంగాణలోనూ బీజేపీకి మద్దతు లభించిందన్నారు ప్రధాని మోదీ. తప్పుడు హామీలు, గాల్లో మాటలను ఓటర్లు విశ్వసించలేదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. 'ఎన్నికల సమయంలో కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నించారు. పేపర్ లీక్‌, నియామకాల్లో కుంభకోణాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణాల్లో అధికార పక్షాల ఓటమికి కారణమయ్యాయి. అవినీతిపరులకు అండగా నిలిచిన, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించినవారికి, 'ఘమండియా (అహంకారపూరిత)' కూటమికి.. ఈ విజయాలు స్పష్టమైన హెచ్చరిక. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసినవారిని ప్రజలు తిరస్కరించారు. దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయాలకు పాల్పడొద్దు. అందరూ ఒక వేదికపైకి వస్తే.. మంచి ఫొటోలు, మీడియా ముఖ్యాంశాలు లభిస్తాయి. కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరు. మీ మార్గాలను సరిదిద్దుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు పంపుతారు' అని విపక్ష కూటమి 'ఇండియా' కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల శక్తులన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తాయని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వాటితో పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తనవరకు కేవలం నాలుగే కులాలు (మహిళలు, యువత, రైతులు, పేదలు) ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో వారంతా బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపులో తమ విజయాన్ని చూసుకుంటున్నట్లు తెలిపారు. తమ భద్రత, గౌరవానికి బీజేపీ మాత్రమే హామీ ఇవ్వగలదని మహిళలు విశ్వసిస్తున్నారన్నారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్​..
అంతకుముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడిచేస్తున్నాయని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు తన కృతజ్ఞతలను తెలిపారు. మీ సంక్షేమం కోసం తాము చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని వెల్లడించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు మోదీ తెలియజేశారు.

బుజ్జగింపు, కుల రాజకీయాలకు గుడ్​బై!
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. బుజ్జగింపులు, కుల రాజకీయాల రోజులు ముగిసిపోయాయని ఇవాళ ఫలితాలు రుజువు చేశాయని అమిత్‌షా వివరించారు. నవీన భారతం పనిచేసే ప్రభుత్వాలకే పట్టంకట్టిందని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు, పేదలు, రైతు సోదర సోదరీమణులు ప్రదర్శించారని అమిత్‌ షా అన్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించిన ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సంక్షేమ ఫలాలు, సుపరిపాలనకు మధ్యప్రదేశ్‌ ప్రజలు ఆమోదించి బీజేపీని ఆశీర్వదించారని పేర్కొన్నారు. అటు రాజస్థాన్‌లో బీజేపీ జయకేతనం ఎగరవేయడంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి- బీజేపీకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన వీరభూమి రాజస్థాన్‌ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని ట్వీట్‌ చేశారు.

'సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుంది'
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేదని సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఎక్స్​లో పోస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు రాహుల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.

ఖర్గే స్పందన
ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి వచ్చిన ఫలితాలు నిస్సందేహంగా నిరుత్సాహానికి గురిచేశాయన్నారు. కానీ మరింత దృఢ నిశ్చయంతో ఈ మూడు రాష్ట్రాల్లో తమను తాము పునర్నిర్మించుకొనేందుకు పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ఉత్సాహంగా పోరాడిందని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కృషిని ప్రశంసించారు. తాత్కాలికంగా ఎదురైన ఈ ఒడుదొడుకులను అధిగమించి- ఇండియా కూటమి పార్టీలతో కలిసి వచ్చే వారితో లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతామని పేర్కొన్నారు.

సెమీఫైనల్స్​లో బీజేపీ సూపర్​ షో- విజయానికి ప్రధాన కారణాలివే!

తెలంగాణలో హిట్- రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​లో పవర్​ కట్​​- 2024లో కాంగ్రెస్ దారెటు?

Last Updated :Dec 3, 2023, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details