తెలంగాణ

telangana

Omicron virus India: దేశంలో ఒమిక్రాన్ కేసులు లేవు.. కానీ..!

By

Published : Nov 29, 2021, 6:18 PM IST

దేశంలో ఒమిక్రాన్ కేసులు (Omicron variant in India) బయటపడనప్పటికీ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నమూనాల్లో గుర్తు తెలియని వేరియంట్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో డెల్టా కంటే భిన్నమైన వేరియంట్​ ఉన్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మరో ఇద్దరికి సైతం కొవిడ్ సోకింది.

Omicron virus India
దేశంలో ఒమిక్రాన్ కేసులు

భారత్​లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. కొవిడ్​పై ఏర్పాటు చేసిన కన్సార్షియం ఇన్సాకాగ్(Omicron virus India).. పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా పాజిటివ్​గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలకు జీనోమ్ విశ్లేషణ చేపడుతున్నట్లు వివరించారు.

అయినా ఆందోళనే..

ఒమిక్రాన్ నిర్ధరణ కాకపోయినప్పటికీ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలో (Bengaluru omicron virus) కరోనా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి నమూనా.. డెల్టా కంటే భిన్నమైన వేరియంట్​ కలిగి ఉందని కర్ణాటక వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. ఈ విషయంపై ఐసీఎంఆర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

"డెల్టా వేరియంట్ గత తొమ్మిది నెలల నుంచి ఉంది. బాధితుడు భిన్నమైన వేరియంట్ బారిన పడ్డట్లు రిపోర్టులో తేలింది. అది డెల్టాకు భిన్నంగా ఉంది. ఈ నమూనాను ఒమిక్రాన్ అని అంటారా? దాని గురించి నేను అధికారికంగా ఏమీ చెప్పలేను. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. నమూనాను ఐసీఎంఆర్​కు పంపించాం."

-సుధాకర్, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమేమీ కాదని దక్షిణాఫ్రికాలో ఉండే తన క్లాస్​మేట్​, డాక్టర్ వెల్లడించారని సుధాకర్ తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందడం మాత్రం నిజమేనని అన్నారు. బాధితులకు వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ప్రభావం అధికంగా ఉండదు కాబట్టి.. ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం కూడా ఉండదన్నారు.

ఠాణెలో ఒకరికి...

మరోవైపు, సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రకు (Maharashtra Omicron) వచ్చిన ఓ వ్యక్తి(32)కి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటేనా అన్న విషయం ఇంకా తెలియలేదు. బాధితుడిని ప్రస్తుతం ఠాణెలోని కొవిడ్ కేర్ సెంటర్​లో ఐసోలేషన్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో రోగి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. ఏడు రోజుల్లో ఫలితం వస్తుందని చెప్పారు.

మర్చంట్ నేవీ ఇంజినీర్ అయిన బాధితుడు.. నవంబర్ 24న ఠాణెలోని దొంబివ్లి పట్టణానికి వచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరి దుబాయ్ మీదుగా దిల్లీకి చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్​గా తేలింది. ఆయన కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి నెగెటివ్ వచ్చింది. ఇంజినీర్​ ప్రయాణించిన విమానంలో వారి వివరాలను సేకరిస్తున్నారు.

చండీగఢ్​లో మరొకరికి...

సౌతాఫ్రికా నుంచి చండీగఢ్​కు వచ్చిన ఓ వ్యక్తి సైతం (chandigarh omicron case) కరోనా బారిన పడ్డట్లు తేలింది. ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్​గా వచ్చింది. గత వారమే బాధితుడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బాధితులు ఉండే సెక్టార్-15 ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. బాధితుల నమూనాలను దిల్లీకి పంపినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details