తెలంగాణ

telangana

ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ, రిటైర్మెంట్​ రోజున కీలక వ్యాఖ్యలు

By

Published : Aug 26, 2022, 3:25 PM IST

CJI NV Ramana
సీజేఐ ఎన్​వీ రమణ

CJI NV RAMANA NEWS అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ సందర్భంగా ఎన్​వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

CJI NV RAMANA NEWS : దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కీలక అధ్యాయం లిఖితమైంది. కోర్టు చరిత్రలో తొలిసారిగా.. ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రత్యక్షప్రసారాల కోసం చాలా కాలం నుంచి కృషిచేస్తూ వచ్చిన జస్టిస్‌ ఎన్​వీ రమణ.. తాను పదవీ విరమణ చేస్తున్న రోజు ఈ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. ఫలితంగా ఆయన నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేశారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే వెసులుబాటు కల్పించారు.

CJI farewell speech : విచారణ అనంతరం మాట్లాడిన సీజేఐ అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆ దిశలో తాను శాయశక్తులా కృషి చేశానని గుర్తుచేసుకున్నారు. పెండింగ్‌ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన.. కేసుల లిస్టింగ్‌, విచారణ తేదీల ఖరారుపైఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తన హయాంలో 50 రోజుల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల కూడా జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ కేసుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న జస్టిస్‌ రమణ లేనిపక్షంలో ప్రజల నుంచి గౌరవాన్ని ఆశించలేమని స్పష్టం చేశారు.

"న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఏకైక మార్గం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున ఉపయోగించడమే. కృత్రిమ మేధస్సును ఉపయోగించి అన్నింటికీ పరిష్కారం చూపాలి. ఈ దిశలో కొన్ని మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసినప్పటికీ భద్రతాపరమైన అంశాల దృష్ట్యా మరింత పురోగతి సాధించలేక పోయాం. కేసుల్లో సంవాదాలు, చర్చలను మరింత త్వరగా పూర్తిచేసి సామాన్యులకు త్వరితగతిన ఆర్థికంగా భారం కాకుండా న్యాయం అందించేందుకు మనమంతా ప్రయత్నించాలి. సుప్రీంకోర్టు అభివృద్ధిలో నేనొక్కడిని మాత్రమే కాదు.. ఎంతోమంది గొప్పవారు త్వరగా న్యాయం అందించేందుకు తమ వంతుగా ఎంతో కృషిచేశారు. ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీకాలమైన గత 16 నెలల్లో 50 రోజులు మాత్రమే పూర్తిస్థాయి విచారణలు జరగడం బాధాకరం. ప్రధాన న్యాయమూర్తులు వస్తారు, వెళతారు కానీ సుప్రీంకోర్టు శాశ్వతం. ప్రతిఒక్కరూ ఈ వ్యవస్థకు ఎంతో కొంత తమ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఈ విషయంలో నా శాయశక్తులా కృషిచేశాను."

--జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి

జస్టిస్‌ ఎన్​వీ రమణ పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు భావోద్వేగానికి లోనయ్యారు. జస్టిస్‌ ఎన్​వీ రమణ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. న్యాయవ్యవస్థకు జస్టిస్‌ రమణ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ సీనియర్‌ న్యాయవాది ధుష్యంత్‌ దవే.. జస్టిస్‌ రమణ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. జస్టిస్‌ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు సహా రాజ్యాంగం పక్షాన నిలిచారని పేర్కొన్నారు.

జస్టిస్‌ రమణ కష్టకాలంలోనూ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ మరో సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశంసించారు. సుప్రీంకోర్టు హుందాతనం, సమగ్రతను పరిరక్షించారని పేర్కొన్నారు. జస్టిస్‌ రమణ హయాంలో వివిధ హైకోర్టుల్లో 224మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసినట్లు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ గుర్తుచేశారు. తొలిసారి సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. వివిధ ట్రైబ్యునళ్లలో 100మందికిపైగా సభ్యులను నియమించినట్లు వెల్లడించారు. సీజేఐగా జస్టిస్‌ రమణ సాధించిన విజయాలు చిరస్మరణీయమని కొనియాడారు.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా సీజేఐగా జస్టిస్‌ ఎన్​వీ రమణ సేవలను కొనియాడారు. న్యాయ విభాగంలో కర్త మాదిరిగా తన విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు. జస్టిస్‌ రమణ పదవీవిరమణ న్యాయవ్యవస్థకు తీరని లోటు అని సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు.

ఇవీ చదవండి:ఆజాద్​ రాజీనామా దురదృష్టకరమన్న కాంగ్రెస్, భాజపా వెల్​కమ్​

ఒక చేతిలో కుమారుడు, మరో చేత్తో రిక్షా సవారీ, భార్య ప్రేమ కారణంగా భర్తకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details