తెలంగాణ

telangana

దేశంలో ఒమిక్రాన్ కలవరం- తమిళనాడులో 33, కర్ణాటకలో 12 కొత్త కేసులు

By

Published : Dec 23, 2021, 12:22 PM IST

Updated : Dec 23, 2021, 5:12 PM IST

Omicron cases India: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా 50కిపైగా కేసులు బయటపడ్డాయి. తమిళనాడులో ఒకేసారి 33 మందికి ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలింది. మరోవైపు, కర్ణాటకలో తొమ్మిదేళ్ల బాలికకు ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు 31కి చేరాయి.

india omicron cases today 2021
india omicron cases

Omicron cases India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 300 దాటింది.

కర్ణాటకలో ఒకేరోజు 12 కొత్త ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,11 సంవత్సరాల బాలికలు ఉన్నారు. గురువారం మొత్తం బెంగళూరు నుంచి 10 మందికి పాజిటివ్​గా తేలగా.. మైసూర్​, మంగళూరు నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.

బెంగళూరు కేసుల్లో.. ఐదుగురు యూకే నుంచి ఇటీవలే వచ్చారని, మరో ఇద్దరు డెన్మార్క్​, నైజీరియాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధరించారు.

మైసూరులో తొమ్మిదేళ్ల బాలికకు ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలింది. బాలికకు ఎలాంటి లక్షణాలు లేవని మైసూరు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. అయితే, ఆమెను వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.

బెంగళూరులో ఒకే కుటుంబంలోని నలుగురికి ఒమిక్రాన్​ సోకింది. తొలుత యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్​గా తేలగా.. అనంతరం అదే కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్​ సోకింది. వారిని మణిపాల్​ ఆస్పత్రికి తరలించి.. బాధితులు నివాసం ఉంటున్న అపార్ట్​మెంట్​ను సీల్​ చేసినట్లు అధికారులు తెలిపారు. అపార్ట్​మెంట్​ వాసులందరికీ కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

Tamil Nadu omicron cases

తమిళనాడులో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఆయనతో పాటు ప్రయాణించిన పలువురితో పాటు మొత్తం 89 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పరీక్షించిన నమూనాల్లో 33 నమూనాలకు.. ఫలితం ఒమిక్రాన్ పాజిటివ్​గా వచ్చాయని తెలిపారు. 13 మందికి నెగెటివ్ అని తేలిందని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు పెరిగిందన్నారు. చెన్నైలో 26, సేలంలో ఒకటి, మధురైలో నాలుగు, తిరువన్నమలైలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు.

Omicron cases in Kerala

కేరళలో మరో ఐదుగురు ఒమిక్రాన్​ వేరియంట్​ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. ఎర్నాకుళంలోనే నలుగురిని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు యూకే నుంచి.. మరో ఇద్దరు ఆల్బేనియా, నైజీరియాల నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.

Gujarat Omicron cases

గుజరాత్​లో 24 గంటల వ్యవధిలో 9 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 23కు పెరిగింది. 19 మందికి చికిత్స కొనసాగుతోంది. నలుగురు కోలుకున్నారు.

West Bengal Omicron cases

బంగాల్​లో ఇద్దరు వ్యక్తులకు తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. బాధితుల్లో ఓ వ్యక్తి యూకే నుంచి, మరొకరు నైజీరియా నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉందని చెప్పారు. ఇదివరకు ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకింది. ఇది బంగాల్​లో నమోదైన తొలి కేసు.

ఒడిశాలో ఇద్దరికి...

నైజీరియా నుంచి ఒడిశా వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిందని భువనేశ్వర్ లైఫ్ సైన్సెస్ వెల్లడించింది. భువనేశ్వర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీరిద్దరూ చికిత్స పొందుతున్నారని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది.

రాజస్థాన్​లో మరో కేసు

రాజస్థాన్​లోని అజ్మీర్​లో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడు దిల్లీ నుంచి నాలుగు రోజుల క్రితం అజ్మీర్​కు వచ్చారని అధికారులు వెల్లడించారు. బాధితుడికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యుల వివరాలను సేకరించామని తెలిపారు. వారిని అబ్జర్వేషన్​లో ఉంచామని చెప్పారు. వారి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని స్పష్టం చేశారు. బాధితుడు ఆఫ్రికాలోని ఘనాలో పని చేస్తున్నాడని వివరించారు.

ఇదీ చదవండి:India covid cases: దేశంలో కొత్తగా 7,495‬ కరోనా కేసులు

Last Updated :Dec 23, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details