తెలంగాణ

telangana

అమూల్​ గొడవలో కొత్త ట్విస్ట్​.. కేరళలో 'నందిని'కి సెగ

By

Published : Apr 14, 2023, 3:59 PM IST

Updated : Apr 14, 2023, 4:50 PM IST

Milma And Nandini Issue : కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్‌ ప్రవేశం రాజకీయరంగు పులుముకున్న నేపథ్యంలో ఆ మంటలు పొరుగు రాష్ట్రం కేరళకు వ్యాపించాయి. నందిని పాలకు పోటీగా అమూల్‌ ప్రవేశాన్ని కర్ణాటకలో విపక్షాలు వ్యతిరేకిస్తుంటే అదే నందిని తమ రాష్ట్రంలో స్టోర్లు తెరవడంపై కేరళకు చెందిన పాల సహకార సంస్థ మిల్మా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్ర పరిధులు దాటి విక్రయాలు చేపట్టడాన్ని తప్పుబట్టింది. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది.

Milma Milk Chairman Fires On Karnataka Nandini Milk Latest News
కర్ణాటక నందిని పాలపై కేరళ మిల్మా సంస్థ ఛైర్మన్​ మణి ఫైర్​

Milma And Nandini Issue : కేరళ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌- మిల్మా పేరిట ఆ రాష్ట్రంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. నందిని పేరిట పాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే కర్ణాటక మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ కేరళలో పలుచోట్ల ఔట్‌లెట్లు తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లక్షలాది మంది పాడి రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సహకార వ్యవస్థకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మిల్మా ఆరోపించింది. కొన్ని రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధులను దాటి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది సమాఖ్య, సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, సహకార స్ఫూర్తికి ప్రాణం పోసిన త్రిభువన్‌దాస్‌, వర్గీస్‌ కురియన్‌ వంటి మహానుభావుల ఆదర్శాలకు వ్యతిరేకమని మిల్మా ఛైర్మన్‌ కేఎస్‌ మణి పేర్కొన్నారు.

కర్ణాటకలో అమూల్‌ పాల ఉత్పత్తులను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నందిని బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని కేరళ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ మణి ప్రశ్నించారు. ఈ ధోరణి రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధి దాటి వేరే రాష్ట్రాల్లో పాల ఉత్పత్తులు విక్రయించకూడదన్న ఒప్పందాన్ని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లో ఔట్‌లెట్లు ప్రారంభించటం మానుకోవాలని నందిని బ్రాండ్‌కు సూచించారు. ఇతరరాష్ట్రాలతో పోలిస్తే కేరళలో పాల సేకరణ ఖర్చు అధికంగా ఉందని, వార్షిక లాభాల్లో 83 శాతం పాడి రైతులకు వివిధ రూపాల్లో తిరిగి చెల్లిస్తున్నామని మిల్మా ఛైర్మన్‌ మణి పేర్కొన్నారు.

కర్ణాటకలో అమూల్ వర్సెస్​ నందిని..
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న వేళ మరో అమూల్​, నందినిల పేరుతో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్‌ ఆ రాష్ట్రంలో తమ ఔట్​లెట్లను పెట్టేందుకు అనుమతులతో ముందుకొచ్చింది. ఈ పరిణామం గత కొద్ది రోజులుగా అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

గుజరాత్‌ రాష్ట్ర పాల సహకార సంస్థ బ్రాండ్‌- అమూల్‌, కర్ణాటక పాల సహకార సమాఖ్య బ్రాండ్‌(కేఎంఎఫ్)- నందిని కలిసి పనిచేయాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బెంగళూరులోనూ అమూల్‌ పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయంటూ ఆ కంపెనీ ట్వీట్‌ చేసింది. ఈ రెండింటి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికార బీజేపీపై మండిపడుతున్నాయి.

కర్ణాటకలో నందినిని(కేఎంఎఫ్​).. గుజరాత్​కు చెందిన అమూల్​కు అమ్మేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్​దీప్ సూర్జేవాలా ఆరోపించారు. మరోవైపు కర్ణాటకలో నందినిని అంతమొందించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి విమర్శించారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే అమూల్​, ఒకే మిల్క్, ఒకే గుజరాత్​' నినాదంతో ముందుకు సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కర్ణాటకలో అమూల్ రాకను కాంగ్రెస్​, జేడీఎస్​లు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. 'అమూల్‌ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. నందిని అనేది జాతీయ బ్రాండ్. ఇది కర్ణాటకకు మాత్రమే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ నందినికి గొప్ప బ్రాండ్​గా పేరుంది' అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Apr 14, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details