తెలంగాణ

telangana

'నా భార్యకు దోమలు కుడుతున్నాయ్.. హెల్ప్ చేయండి'.. యువకుడి ట్వీట్.. పోలీసులు ఏం చేశారంటే?

By

Published : Mar 22, 2023, 9:45 AM IST

తన భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. మస్కీటో కిల్లర్​ను తీసుకురావాలని కోరుతూ ట్వీట్ చేశాడు. దీనికి పోలీసులు సైతం స్పందించారు. వారు ఏమన్నారంటే?

man-tweeted-up-police-for-mosquito-killer-to-save-wife-and-daughter
మస్కిటో​ కిల్లర్​ కోసం పోలీసులకు యువకుడి ఫిర్యాదు

'దోమలు కుడుతున్నాయి. నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు.. మస్కిటో కిల్లర్​ కావాలి' అని ఓ యువకుడు చేసిన ట్వీట్​కు పోలీసులు స్పందించారు. వెంటనే అతడికి.. ఓ మస్కిటో కిల్లర్​ను తెచ్చి ఇచ్చారు. ఎల్లప్పుడు తాము ప్రజల సేవలోనే ఉంటామని నిరూపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ సంఘటన జరిగింది. సంభల్ జిల్లాకు చెందిన అసద్​ ఖాన్​ అనే యువకుడు ఈ ట్వీట్ చేశాడు.

అసద్​ ఖాన్​ భార్యకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో చేర్పించాడు. అదే రాత్రి ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆసుపత్రిలో విపరీతంగా దోమలు ఉన్నాయి. అవి అసద్​ ఖాన్​ భార్యను.. కూతురిని తీవ్రంగా కుడుతున్నాయి. దీంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్​ ఖాన్​.. మస్కిటో కిల్లర్​​ కోసం బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్ని మూసి ఉన్నాయి. ఇక చేసేది లేక మస్కిటో కిల్లర్​ కావాలని కోరుతూ యూపీ పోలీసులకు ట్వీట్​ చేశాడు.

"ఈరోజు నా భార్య చందౌసిలో ఉన్న హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్​లో చిన్నారికి జన్మనిచ్చింది. ఇక్కడ నా భార్య, కూతురు చాలా ఇబ్బందులను పడుతున్నారు. ఇప్పటికే భార్య తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. దానికి తోడు దోమలు కూడా విపరీతంగా కుడుతున్నాయి. దయచేసి నాకు ఓ మస్కిటో కిల్లర్​ను​ తెచ్చి ఇవ్వండి" అని యూపీ పోలీసులకు అసద్​ ఖాన్​ ట్వీట్​ చేశాడు. దానికి సంభల్​ పోలీసులకు, 'డయల్​ 112' ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్​ చేశారు.

అయితే, పోలీసులు ఈ ట్వీట్​పై మానవీయ కోణంలో స్పందించారు. వెంటనే అసద్ ఖాన్ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చి అసద్​ ఖాన్​కు మస్కిటో కిల్లర్​ను అందించారు. 'మాఫియా నుంచి మస్కీటో (దోమలు) వరకు దేన్నైనా ఎదుర్కొంటాం' అని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు యూపీ పోలీసులు. పోలీసుల సహాయానికి అసద్​ ఖాన్​ ధన్యవాదాలు తెలిపారు. యూపీ పోలీసులు చేసిన ఈ మంచి పనికి సోషల్​ మీడియా వేదిక ద్వారా కూడా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం అసద్​ ఖాన్​ చేసిన ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

యువకుడి ట్వీట్​

రెండు గంటల్లో... 1600 మంది ఆకలి తీర్చారు
ఇటీవల ఆంధ్రప్రదేశ్​ పోలీసులు సైతం తమ సహాయతను చాటుకున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా లేకుండా ముంబయి నుంచి తమిళనాడుకు ప్రయాణిస్తున్న కార్మికుల కడుపులు నింపారు. ఆహారం లేక మలమలా మాడిపోతున్న వారిస మస్య తెలుసుకున్న అనంతపురం ఎస్పీ.. అన్నం పెట్టి ఆకలి తీర్చారు. ఎంతో మంది సహకారంతో 1600 మంది కూలీల ఆకలి తీర్చి.. వారి కళ్లల్లో సంతోషం చూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details