తెలంగాణ

telangana

నీటి కోసం 74 ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. మూడు బావులను తవ్విన 'వెల్​మ్యాన్​'

By

Published : Feb 14, 2023, 9:00 PM IST

గ్రామంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు సీతారాం రాజ్​పుత్​ అనే వృద్ధుడు. ఈ సమస్య పరిష్కారం కోసం నడుం బిగించాడు. ప్రభుత్వ సాయం లేకుండానే గ్రామంలోని పంటల కోసం ఏకంగా మూడు బావులను తవ్వాడు. ఇది తెలుసుకున్న భారత క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్..​ సీతారాంకు సాయం అందించాలని ఆ జిల్లా అధికారులను కోరారు. దీంతో స్పందించిన అధికారులు ఆయనకు ప్రభుత్వం నుంచి అర్హత కలిగిన పథకాలను అమలు చేస్తామని మాటిచ్చారు.

Old Man Digged Wells In Madhya Pradesh
మధ్యప్రదేశ్​లో బావులను తొవ్విన వృద్ధుడు

పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించాడు మధ్యప్రదేశ్​​కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు. ఏకంగా మూడు బావులను తవ్వి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. 'మౌంటేన్​ మ్యాన్'​గా గుర్తింపు పొందిన బిహార్​కు చెందిన దశరథ్‌ మాంఝీ గురించి వినే ఉంటారు. తన గ్రామం కోసం ఏకంగా ఎంతో ఎత్తున్న పర్వతాన్ని తొలగించి దారి వేశాడు. తాజాగా సీతారాం రాజ్​పుత్​ అనే వృద్ధుడు.. తన గ్రామ ప్రజల పంటల కోసం నీటి బావులను తవ్వి 'వెల్​ మ్యాన్​'గా అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

లక్ష్మణ్ చొరవతో ఆర్థిక సాయం..
మధ్యప్రదేశ్​ ఛతర్‌పుర్ జిల్లాలోని లవ్‌కుష్ నగర్‌కు చెందిన సీతారాం రాజ్‌పుత్‌ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను చూసిన సీతారాం.. బావులను తవ్వడం ప్రారంభించాడు​​. ఈయన గురించి తెలుసుకున్న స్టార్​ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​.. సంబంధిత అధికారులను సహాయం చేయాలని కోరుతూ ట్వీట్​ చేశారు. లక్ష్మణ్​ పోస్ట్​కు స్పందించిన వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు రాజ్​పుత్​కు సహాయం అందించేందుకు గ్రామానికి చేరుకున్నారు.

సీతారామ్​ పొలం సమీపంలోని బావి

ఆయన ఒక్కడే..
2018లో తన పొలంలో మొదటి బావిని తవ్వడం ప్రారంభించిన సీతారాం.. ప్రభుత్వం సాయం లేకుండానే 18 నెలల్లోనే పూర్తి చేశాడు. దీంతో బావి చుట్టుపక్కల పొలాలకు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు బావులు తవ్వాలని నిశ్చయించుకున్న రాజ్​పుత్..​ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల సాయంతో మరో రెండు బావులను తవ్వాడు.

తవ్విన బావులను అధికారులకు చూపించేందుకు తీసుకువెళ్తున్న సీతారామ్​ రాజ్​పుత్​

"డబ్బులు లేకుండా బావులు తవ్వించడం సాధ్యం కాదని నా సోదరుడు చెప్పినా నేను వినలేదు.నేనే స్వయంగా బావి తవ్వితే ఏమి అవుతుంది అనే ఆలోచన వచ్చింది. ఆలస్యం చేయకుండా పని మొదలుపెట్టాను. ఇది పూర్తి చేయడానికి నాకు ఏడాదిన్నర సమయం పట్టింది. భూమిలోని 22 చోట్ల నీళ్లు వచ్చాయి. ఇటీవల అధికారులు నా వ్యవసాయ భూమిలోని బావులను సందర్శించారు. బావులకు రూ.2.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు."

-- సీతారామ్​ రాజ్​పుత్​, బావులు తవ్విన వృద్ధుడు

బావులు తవ్విన సీతారాంను అభినందించిన అధికారులు.. అతడికి ప్రభుత్వ పథకం కింద స్ప్రింక్లర్ పంపులతో పాటు ఎరువును తయారు చేసే పరికరాన్ని అందజేశారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సీతారాం రాజ్​పుత్​కు వివిధ ప్రభుత్వ పథకాలను సైతం వర్తింపజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

అధికారులు అందించి స్ప్రింక్లర్​తో సీతారామ్

ABOUT THE AUTHOR

...view details