తెలంగాణ

telangana

దిల్లీలో మరో ఘోరం.. మహిళ దారుణ హత్య.. శవాన్ని ఇంట్లో వదిలి ప్రియుడు పరార్

By

Published : Dec 3, 2022, 10:58 AM IST

తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. దిల్లీలో ఈ ఘటన జరిగింది. భర్తను వదిలేసి తనతో కలిసుంటున్న ఓ మహిళను నిప్పింటించి చంపేందుకు ప్రయత్నించాడు ప్రియుడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

murder in delhi
murder

తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను దారుణంగా చంపాడు ఓ వ్యక్తి. ఆమె కూతురుని మభ్యపెట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు.. హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. దిల్లీలో జరిగిందీ ఘటన. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. మృతురాలి ముఖంతో పాటు మెడపై తీవ్ర గాయాలున్నాయని.. అంతే కాకుండా ఆమె కుడి చేతి వేలును సైతం నిందితుడు విరిచేశాడని పోలీసుల విచారణతో తేలింది.

అసలేం జరిగిందంటే..
దిల్లీలోని పశ్చిమ్​ విహార్​కు​​ చెందిన 45 ఏళ్ల మన్​ప్రీత్​ సింగ్​ అనే వ్యక్తికి 2015లో గణేశ్​ నగర్​కు చెందిన రేఖ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు లివిన్​ రిలేషన్​షిప్​లో ఉండేవారు. వీరితో పాటు రేఖ కూతురు కూడా నివసిస్తుండేది. అయితే గత కొంత కాలంగా డబ్బు విషయమై.. తరచూ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. దీంతో విస్తుపోయిన రేఖ అతనితో మాట్లాడటం తగ్గించింది. ఇంట్లోకి కూడా అనుమతించేది కాదు. దీంతో ఆమెను దారుణంగా హతమార్చేందుకు మన్​ప్రీత్​ స్కెచ్​ వేశాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు.

డిసెంబర్​ 1న ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో రేఖ కూతురు నిద్ర లేచి తన అమ్మ ఎక్కడ అని మన్​ప్రీత్​ను అడగగా.. మార్కెట్​కు వెళ్లిందని సమాధానం చెప్పాడు. అతని మాటలకు అనుమానం వచ్చిన యువతి పశ్చిమ్​ విహార్​లోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. పోలీసులకు విషయం చెప్పి వారి సహాయంతో గణేశ్​ నగర్​ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తలుపులు వేసిన విషయాన్ని గమనించిన పోలీసులు.. డోర్​ను బద్దలు కొట్టి చూడగా రేఖ అప్పటికే మృతి చెందింది. కన్నీరు మున్నీరైన ఆ యువతి.. ఈ హత్యకు మన్​ప్రీతే కారణమయ్యుంటాడని అనుమానం వ్యక్తం చేసింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని కారు ట్రేస్​ చేసేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్​లను సేకరించారు. సీక్రెట్​ ఇన్​ఫార్మర్లను సైతం నియమించారు. తరచూ లొకేషన్లు మారుస్తున్న అతడు ఆఖరికి పంజాబ్​లోని పాటియాలాలో పోలీసుల చేతికి చిక్కాడు. అయితే అతనిపై ఇది వరకే ఏడు కేసులు నమోదయ్యాయని పోలీసుల విచారణలో బయటపడింది.

హత్యకు యత్నం...
మరోవైపు, భర్తను వదిలేసి తనతో సహజీవనం చేస్తున్న మహిళను ప్రియుడు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కిరోసిన్​ పోసి నిప్పంటించగా ఆమె కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహిళ తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం..
ఉత్తరాఖండ్​ రుద్రపుర్​లోని​ ఆదర్శ్ బెంగాలీ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళకు దినేశ్​పుర్​లో నివసిస్తున్న నితిన్​ ముఖర్జీ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది క్రితం భర్తను వదిలేసిన ఆ మహిళ.. కస్తూరీ వాటిక కాలనీలో సంజయ్ షా అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య నవంబర్​ 22న ఓ విషయమై చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన సంజయ్​ ఆమెపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలవ్వగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

ఇదీ చదవండి:

మోదీ ఇంట కమలానికి పరీక్ష.. 2017లో అవమానం.. తర్వాత ఊరట.. మరి ఈసారి?

ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం.. గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details