కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ను సెప్టెంబర్ 6వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్డౌన్ నిబంధనల్లో మరిన్నీ సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 23 నుంచి సినిమా థియేటర్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 9 నుంచి 12 తరగతి మధ్యన ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 50శాతం సామర్థ్యంతో విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతిస్తామని చెప్పింది. అన్ని దుకాణాలు , వాణిజ్య సంస్థలను రాత్రి పది గంటల వరకూ పనిచేసేందుకు అనుమతించిన ప్రభుత్వం ఐటీ సంస్థలు నూరు శాతం సిబ్బందితో పనిచేసేందుకు వెసులుబాటు కల్పించింది.