తెలంగాణ

telangana

'తీర్పులు చెప్పేందుకే ఉన్నాం.. వాయిదాలకు కాదు'

By

Published : Aug 7, 2021, 7:15 AM IST

Updated : Aug 7, 2021, 7:23 AM IST

న్యాయమూర్తులు తీర్పులు చెప్పేందుకు ఉన్నారని, వాయిదాలు వేసేందుకు కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఓ తీర్పుపై చేసిన అప్పీలుకు సంబంధించి ఈ విధంగా స్పష్టం చేసింది ధర్మాసనం.

SC, SC news
సుప్రీం కోర్టు

న్యాయమూర్తులు తీర్పులు ఇస్తామని ప్రమాణం చేశారే తప్ప, వాయిదాలు ఇస్తామని కాదని శుక్రవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఓ తీర్పుపై చేసిన అప్పీలు న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం పరిశీలనకు వచ్చింది. కేసును వాదించాల్సిన న్యాయవాది తరఫున మరో న్యాయవాది వచ్చి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేయాలని కోరారు.

వాదించాల్సిన న్యాయవాది ప్రస్తుతం రాలేదని, అందుకే వాయిదా వేయాలని అడిగారు. ఆయన రాకపోతే మీరే వాదనలు వినిపించవచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించగా రెండు వారాలపాటు వాయిదా కోరాలని మాత్రమే తనకు సూచనలు ఇచ్చారని తెలిపారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం "తీర్పులు ఇవ్వడం ద్వారా విధులు నిర్వర్తిస్తామని మేం ప్రమాణం చేశాం. వాయిదాలు ఇస్తామని కాదు. రాత్రంతా కేసులపై ఎంతో అధ్యయనం చేసి కోర్టులకు వస్తాం. ఇలా వాయిదాలు అడిగితే ఎలా?" అని ప్రశ్నించింది. ఈ వినతిని ఆమోదించలేదు. ఇంతకుముందు ఇలాంటి వ్యవహారాన్ని తిరస్కరించామని, దీన్ని కూడా తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది.

ఇదీ చదవండి:'న్యాయమూర్తులకు బెదిరింపులు తీవ్రమైన అంశం'

Last Updated : Aug 7, 2021, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details