భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు.
"ఈ టీకా పంపిణీ చాలా సులువు. సూది అవసరం లేదు. ఈ టీకాతో ఐజీజీ, ఐజీఏ, టీ-సెల్ అనే మూడు రకాల ప్రతిస్పందనలు వస్తాయి. ప్రపంచంలో మరే ఇతర వ్యాక్సిన్తో ఇది సాధ్యం కాదు" అని కృష్ణ ఎల్ల వివరించారు.
ఇన్కొవాక్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. గతేడాది నవంబర్లోనే ఈ టీకా వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసుగా అందించేందుకు పచ్చజెండా ఊపింది. కొవిన్ ప్లాట్ఫామ్లోనూ ఈ టీకాను చేర్చారు. ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.
ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్ నాసికా టీకాను బూస్టర్గా పొందొచ్చు. 'బీబీవీ154'గా పిలిచే ఈ నాసికా టీకా 'ఇంకొవాక్' బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్ బయోటెక్ వెల్లడించింది.