తెలంగాణ

telangana

INDIA Alliance Meeting Mumbai : పోటాపోటీగా ఇండియా, ఎన్​డీఏ సమావేశాలు.. ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్!.. పొత్తులపై మాయావతి క్లారిటీ

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 7:36 PM IST

Updated : Aug 30, 2023, 7:58 PM IST

INDIA Alliance Meeting Mumbai : 'ఇండియా' కూటమి మూడో సమావేశం ముంబయిలో గురువారం జరగనుంది. ఈ సమావేశంలో కూటమి లోగో ఆవిష్కరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో ఎన్సీపీ పాత్రపై శరద్​ పవార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. మాయావతి సైతం తమ పొత్తులపై స్పష్టతనిచ్చారు. మరోవైపు సెప్టెంబర్‌ ఒకటిన ముంబయిలోనే ఎన్​డీఏ కూటమి రెండో సమావేశం జరగనుంది.

INDIA Alliance Meeting Mumbai
ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం

INDIA Alliance Meeting Mumbai : ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం గురువారం ముంబయిలో జరగనుంది. కూటమి సభ్యులు రెండు రోజుల పాటు భవిష్యత్​ కార్యాచరణపై మంతనాలు జరపనున్నారు. తొలి సమావేశం పట్నా, రెండో భేటీ బెంగళూరులో విజయవంతంగా నిర్వహించిన విపక్ష కూటమి ఇండియా.. అదే ఉత్సాహంతో ముంబయి సమావేశాలకు సిద్ధమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతోపాటు ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాల పరిష్కారం, కూటమి లోగో ఆవిష్కరణ అజెండాతో ఈ భేటీ జరగనున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు.

'ఎన్సీపీపై సందేహాలు వద్దు'
Sharad Pawar Opposition Meet :ఈ సమావేశానికి కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరుకానున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. 28 రాజకీయ పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకానున్నట్లు.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తెలిపారు. రాజకీయ మార్పు కోసం బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపక్ష కూటమి అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై ఇంతవరకు చర్చ జరగలేదని పవార్‌ తేల్చిచెప్పారు. ఎన్సీపీపై సందేహాలు వద్దని, పార్టీని వీడిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పవార్‌ జోస్యం చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎవరి పక్షమో తెలియదని తెలిపారు.

ఇండియా కూటమిలోని పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే వాటి ఉమ్మడి అజెండా అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతెలిపారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 22కోట్ల ఓట్లు సాధించగా.. భాజపాయేతర పార్టీలకు 23కోట్ల ఓట్లు వచ్చినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్ చవాన్‌ తెలిపారు. కూటమి పార్టీలన్నీ కలిసి పనిచేస్తే.. గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

'బీజేపీ వెళ్లిపో'(BJP Chale Jao) అనే నినాదంతో కూటమి సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. కూటమిలో చాలా మందికి ప్రధాని పదవి చేపట్టే సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఎన్​డీఏ' కూటమిలో ఇప్పుడున్న కొన్ని పార్టీలు 'ఇండియా' కూటమిలోకి రావచ్చన్నారు. కాగా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ముంబయి చేరుకున్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శివసేన(యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఇతర కాంగ్రెస్, ఎన్​సీపీ నేతలు ఆమెకు ఎయిర్​పోర్ట్​లో స్వాగతం పలికారు.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో కేజ్రీవాల్‌..
Kejriwal Opposition Meet :ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కడ్‌ తెలిపారు. ఆయన అమలు చేసిన అభివృద్ధి నమూనా దేశం మొత్తానికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. కేజ్రీవాల్‌ ఎల్లప్పుడు ప్రజా అనుకూల బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సహా.. తరుచూ ప్రజాసమస్యలను లేవనెత్తుతుంటారని కక్కడ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాసేపటికే స్పష్టతనిచ్చింది ఆప్​.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో కేజ్రీవాల్‌ లేరని స్పష్టం చేసింది. తమ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కడ్‌ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని ప్రకటించింది. దేశరక్షణ కోసమే తప్ప ప్రధానమంత్రి లేదా మంత్రి పదవి కోసం ఇండియా కూటమిలో భాగం కాలేదని ఆప్‌ మంత్రి అతిషి వివరణ ఇచ్చారు.

'ఏ పార్టీతో పొత్తు లేదు.. ఏ కూటమితోనూ చేతులు కలపం'
Mayawati Opposition Meet :చాలా పార్టీలు బీఎస్​పీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. కానీ తాము ఏ పార్టీతోనూ కలిసి వెళ్లమని.. ఎన్​డీఏ, ఇండియా కూటమితోనూ చేతులు కలపమని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్​లో(క్రితం ట్విటర్) పలు పోస్టులు పెట్టారు. ఇండియా కూటమి మూడో సమావేశం ముంగిట.. బీఎస్​పీ అధినేత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ముంబయిలోనే ఎన్​డీఏ కూటమి రెండో సమావేశం..
Parties in NDA Alliance 2023 Mumbai :మరోవైపు.. సెప్టెంబర్‌ 1నే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని అధికార ఎన్​డీఏ కూటమి రెండో సమావేశం ముంబయిలో జరగనుంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతే లక్ష్యంగా ఎన్​డీఏ తొలి సమావేశం.. గతనెలలో దిల్లీలో జరిగింది. ఎన్​డీఏ సమావేశానికి ఈసారి ఎన్​సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ వర్గం కూడా హాజరుకానుంది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ శిందే వర్గం, బీజేపీతో కలిసి తాము ఈ భేటీకి హాజరవుతామని NCP ఎంపీ సునీల్ తత్కారే చెప్పారు. అయితే.. ప్రతిపక్షాల సమావేశం రోజు తాము భేటీ నిర్వహిస్తున్నామనడంలో అర్థం లేదని, మహారాష్ట్ర శాసనసభ సమావేశాలకు ముందే సమన్వయ కమిటీ ఖరారు చేసినట్లు ఎన్సీపీ ఎంపీ తత్కారే చెప్పారు.

Rahul Gandhi INDIA Alliance : 'విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్!.. ప్రియాంక మా స్టార్​ క్యాంపెయినర్​'

'పవార్​జీ.. మోదీకి లొంగిపోయారా?'.. ప్రధానికి అవార్డు ప్రదానంపై కాంగ్రెస్ సెటైర్లు! ఇండియా కూటమిలో చీలిక?

Last Updated :Aug 30, 2023, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details