తెలంగాణ

telangana

'త్రిదళాల అవసరాలు తీర్చేందుకు కృషి'.. సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్

By

Published : Sep 30, 2022, 10:42 AM IST

Updated : Sep 30, 2022, 11:28 AM IST

భారత్ దేశ త్రిదళాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్​(విశ్రాంత) అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

anil chauhan
lt genral appointed as cds

Anil Chauhan Cds : భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా.. విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో.. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపై. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్‌ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు. సైన్యం, నౌక, నావిక దళాల అవసరాలను తీర్చేందుకు తాను కృషి చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం అనిల్ చౌహాన్‌ అన్నారు. ఆయన అంతకుముందు జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు.

గౌరవ వందనం స్వీకరిస్తున్న సీడీఎస్​
త్రివిధ దళ అధికారులతో సీడీఎస్​
సీడీఎస్ అనిల్ చౌహాన్

దేశ సేవలో 40 ఏళ్లు..
దాదాపు 40ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ చౌహాన్. అనేక కీలక పదవుల్లో పనిచేశారు. జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది. ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలు..

  • 1961 మే 18న ఉత్తరాఖండ్​లోని ఘర్వాల్​లో జన్మించారు. మహారాష్ట్ర ఘడక్​వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ, ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని​ ఇండియన్​ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణ పొందారు.
  • నార్తర్న్ కమాండ్​లోని బారాముల్లా సెక్టార్​లో మేజర్ జనరల్ హోదాలో ఇన్​ఫాంట్రీ డివిజన్​కు అనిల్​ నేతృత్వం వహించారు.
  • ఈశాన్య భారతంలోనూ కమాండర్​గా పనిచేశారు. 2019 సెప్టెంబర్​లో తూర్పు కమాండ్​ జనరల్​ ఆఫీసర్​ కమాండింగ్​ ఇన్​ చీఫ్​గా పదోన్నతి పొందారు. 2021 మేలో పదవీ విరమణ పొందారు.
  • పదవీ విరమణ తర్వాత కూడా సేవలు కొనసాగించారు అనిల్ చౌహాన్. జాతీయ భద్రతకు కీలకమైన అనేక అంశాల్లో తన విలువైన సలహాలు అందించారు.
  • సైన్యంలో అందించిన సేవలకుగానూ పరమ్​ విశిష్ట్ సేవా పతకం, ఉత్తమ్​ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట్ సేవా పతకం, సేనా పతకం, విశిష్ట్ సేవా పతకం అందుకున్నారు అనిల్ చౌహాన్.

సీడీఎస్​ వ్యవస్థను కొన్నేళ్ల క్రితం తొలిసారి ఎన్​డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2020 జనవరి 1న జనరల్ బిపిన్ రావత్​ భారత దేశ తొలి సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తమిళనాడులోని కూనూర్​ సమీపంలో 2021 డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సీడీఎస్​ బాధ్యతలు, అధికారాలు

  • త్రివిధ దళాల అధిపతులతో సమానంగా, మూడు దళాలకు ప్రథముడిగా సీడీఎస్‌ ఉంటారు. ప్రొటోకాల్‌ జాబితాలో వారి కన్నా ఎక్కువ హోదాలో ఉంటారు. త్రివిధ దళాధిపతులతో కూడిన 'చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ'కి శాశ్వత ఛైర్మన్‌గా ఉంటారు.
  • సైనిక వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు.
  • త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా ఉంటారు. అయితే విడివిడిగా తమ దళాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఆయా దళాల అధిపతులే రక్షణ మంత్రికి సలహాలిస్తారు.
  • సీడీఎస్‌కు త్రివిధ దళాలపైన, వాటి అధిపతులపై సైనికపరమైన అజమాయిషీ ఉండదు.
  • సైబర్‌, అంతరిక్షానికి సంబంధించిన విభాగాలతోపాటు త్రివిధ దళాల సంస్థలు సీడీఎస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. అణ్వస్త్ర ప్రాధికార సంస్థ (న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీ)కి సీడీఎస్‌ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు.
  • రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలిలో, జాతీయ భద్రతా సలహాదారు నాయకత్వంలోని రక్షణ ప్రణాళిక కమిటీలో సీడీఎస్‌ సభ్యుడిగా ఉంటారు.
  • సాధన సంపత్తి కొనుగోళ్లలో త్రివిధ దళాలకు ప్రాధాన్య క్రమాన్ని నిర్దేశించాలి.
  • సీడీఎస్‌ పదవిని చేపట్టే అధికారి తన పదవీ విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదు.

ఇదీ చదవండి:'సిగ్నల్ జంప్ చేశా.. ఫైన్​ కట్టొచ్చా?'.. బిర్లా​ ట్వీట్​కు పోలీసుల షాకింగ్ రిప్లై

థర్డ్ క్లాస్ చదువుతూ పదో తరగతి వారికి పాఠాలు- 'మ్యాథ్స్ గురూ'కు సోనూ ఫిదా

Last Updated : Sep 30, 2022, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details