తెలంగాణ

telangana

20ఏళ్లు పోరాడినా న్యాయం దక్కలేదని ఆత్మహత్య.. తాను పెంచిన చెట్టుకే ఉరి!

By

Published : Sep 20, 2022, 5:28 PM IST

ENVIRONMENTALIST COMMITS SUICIDE
ENVIRONMENTALIST COMMITS SUICIDE

అక్రమాలకు వ్యతిరేకంగా ఆ పెద్దాయన 20ఏళ్లు పోరాడారు. పేదలకు న్యాయం చేయలేకపోతే ఉరికంబం ఎక్కుతానని ప్రతినబూనారు. చివరకు.. అలానే చేశారు. తాను నాటి, పెంచిన చెట్టుకే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకీ ఎవరాయన?

కర్ణాటకలో ప్రముఖ పర్యావరణవేత్త, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాజ్యోత్సవ అవార్డు గ్రహీత సాలుమరద వీరాచారి.. ఆత్మహత్య చేసుకున్నారు. దావరణగెరె జిల్లా హరిహర్ మండలం మిట్లకట్టె గ్రామంలో తాను నాటి, పెంచిన చెట్టుకే మంగళవారం వేకువజామున ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పేదలకు న్యాయం చేయడంలో విఫలమైతే ఉరికంబం ఎక్కుతానని గతంలోనే ప్రకటించిన వీరాచారి.. సోమవారం జరిగిన పరిణామంతో అన్నంత పని చేశారు.

ఎవరీ వీరాచారి? సోమవారం ఏమైంది?
వీరాచారి.. ప్రకృతి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త. పేదల కోసం గళం వినిపించడంలో ముందుంటారు. దావణగెరె జిల్లాలో సొంత డబ్బులతో దాదాపు 3000 మొక్కలు నాటారు. అందుకే స్థానికులు ఆయన్ను సాలుమరద వీరాచారి అంటారు. కన్నడంలో సాలుమరద అంటే.. మొక్కల వరుస(హరితహారం తరహాలో) అని అర్థం.

పర్యావరణవేత్త వీరాచారి

దాదాపు 20 ఏళ్లుగా మిట్లకట్టె గ్రామంలోని రేషన్​ దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయని పోరాడుతున్నారు వీరాచారి. రేషన్​ షాప్ యజమాని సిద్ధరామప్ప.. ప్రజలకు నిత్యావసరాలు సరిగా పంచడం లేదని, ఏడాదికి 700 క్వింటాళ్ల మేర అక్రమాలకు పాల్పడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై వీరాచారి అనేక ఫిర్యాదులు చేశారు. ఓసారి సిద్ధరామప్ప లైసెన్స్ రద్దు అయినా.. ఆయన పైరవీలతో తిరిగి పొందారని తెలిసింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అయితే.. సిద్ధరామప్ప రేషన్​ షాప్​ మూసేయకుండా న్యాయస్థానం స్టే ఇచ్చింది.

ఇదే వ్యవహారంపై సోమవారం జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో వాడీవేడి సమావేశం జరిగింది. రేషన్ షాప్​ను మూయాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అక్రమాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, దుకాణం మూసేయాల్సిందేనని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే.. ఇదే విషయంపై వీరాచారితో ప్రత్యేకంగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ శివానంద కాపాషి. కోర్టు స్టే ఉన్నందున రేషన్​ దుకాణం మూసేయడం కుదరదని చెప్పారు.

పర్యావరణవేత్త వీరాచారి

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు వీరాచారి. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే బాధతో మంగళవారం 2 గంటల సమయంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిణామంతో మిట్లకట్టె గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిరసనకు దిగారు. వీరాచారి మృతదేహాన్ని కిందకు దించకుండా పోలీసుల్ని అడ్డుకున్నారు. చివరకు కలెక్టర్​ నచ్చజెప్పగా.. శాంతించారు.

ప్రజా సంక్షేమం కోసం వీరాచారి ఎంతో చేశారని, ఆయన్ను తగిన రీతిలో గౌరవించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఆయన గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. వీరాచారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సిద్ధరామప్ప రేషన్ షాప్​ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తగిన స్థలం చూసి.. వీరాచారి పేరిట పార్కు కట్టాలని కోరారు ఆయన కుటుంబసభ్యులు.

ABOUT THE AUTHOR

...view details