తెలంగాణ

telangana

ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఛార్జింగ్​ అవుతుండగానే..

By

Published : May 13, 2023, 7:23 AM IST

Updated : May 13, 2023, 8:43 AM IST

e rickshaw battery explosion
e rickshaw battery explosion

ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఈ-రిక్షా బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్షా బ్యాటరీ ఛార్జింగ్​ అవుతుండగా ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ జరిగింది
అంకిత్ కుమార్​ గోస్వామి అనే వ్యక్తి బారాబంకీ బీబీడీ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు, కోడలితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న అంకిత్​.. ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే రిక్షా నడిపి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్​ పెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే ఈరిక్షా బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ అంకిత్​ భార్య రోలి, కుమారుడు కుంజ్​, కోడలు రియా మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి బాలుడు మృతి
అంతకుముందు మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వసాయ్​లో ఛార్జింగ్​ పెడుతుండగా ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించాడు. తూర్పు వసాయ్​ ప్రాంతంలో రాందాస్​ నగర్​కు చెందిన షానవాజ్​ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్​ బైక్​ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్​ అన్సారీ కుమారుడు షబ్బీర్, తల్లి రుక్సాన్​కు తీవ్రగాయాలయ్యాయి.

బ్యాటరీ పేలి ముగ్గురికి గాయాలు
గుజరాత్​లోని సూరత్‌లో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలింది. స్కూటీకి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. సచిన్ ప్రాంతంలోని మహాలక్ష్మి నగర్ సొసైటీలో నివాసముంటున్న జయలాల్ మునీలాల్ బింద్ (58).. కిరాణ దుకాణం నడుపుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బింద్ స్నేహితుడు మహేశ్ తన స్కూటీకి కిరాణ షాపు వద్ద ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా స్కూటీ బ్యాటరీలు పేలి.. దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో జయలాల్​కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు.

Last Updated :May 13, 2023, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details