కరోనా(Corona virus) కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన బాలలకు 'పీఎం కేర్స్ చిల్డ్రన్'(PM-CARES) పథకం కింద సహాయం అందించే చర్యలను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు(Suprme court) గురువారం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వీరి చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం సూచించింది. బాలలకు సహాయం అందించేందుకు ప్రత్యేక పోర్టల్ రూపొందించామని, ఇంతవరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తొలుత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 418 దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు ఆమోదించారని పేర్కొంది.
దాంతో మిగిలిన వారి దరఖాస్తులను కూడా పరిశీలించి, ఆమోదించాలని కలెక్టర్లను ధర్మాసనం ఆదేశించింది. 'చిన్నారులపై కరోనా మహమ్మారి ప్రభావం'పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతుండడం గమనార్హం. ఈ సందర్భంగా మరికొన్ని సూచనలు చేసింది.
- అవసరమైతే పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న ఈ 2600 మంది బాలల పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించాలి.
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థుల ఫీజులను రద్దు చేసేలా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. ఒకవేళ ఆ పాఠశాలలు అందుకు అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఫీజులను చెల్లించాలి.
- ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న ఆ విద్యార్థుల ఫీజులు, ఇతర ఖర్చులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు కోరవచ్చు.
- ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను తక్షణమే చెల్లించాల్సి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
- చిన్నారుల వివరాలను బాల్ స్వరాజ్ పోర్టల్లో అప్డేట్ చేయడం ఆలస్యం కాకుండా చూడాలి.
బాలలకు లబ్ధి ఇలా..
- ధర్మాసనం అడిగిన మేరకు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకం కింద అందించే సహాయాన్ని వివరించారు.
- లబ్ధి పొందే బాలలను మూడు వర్గాలుగా విభజించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన వారు; గతంలో ఒకర్ని, ఇప్పుడు రెండోవారిని కోల్పోయిన వారు; చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయినవారు అన్న విభజన చేశారు.
- వీరిని గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ విషయంలో పోలీసులు, జిల్లా శిశు సంరక్షణ కేంద్రాలు సహకారం అందించాల్సి ఉంటుంది.
- అయిదు రూపాల్లో సహాయం అందుతుంది. పదో ఏట వరకు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, లేదంటే ప్రయివేటు పాఠశాలలో డే స్కాలర్గా ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రయివేటు పాఠశాలలో చేరితే విద్యా హక్కు చట్టం ప్రకారం పీఎం కేర్స్ నుంచి ఫీజులు చెల్లిస్తారు.
- 11-18 ఏళ్ల వరకు నెలవారీ ఉపకార వేతనం చెల్లిస్తారు. రూ.10 లక్షల మొత్తాన్ని వారి పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారు.
- 23 ఏళ్లు వచ్చే సరికి ఆ మొత్తాన్ని వారికి చెల్లిస్తారు.
- ఏకరూప దుస్తులు, పుస్తకాలకయ్యే ఖర్చులు ఇస్తారు.
- ఉన్నత విద్య, ఆరోగ్య బీమాకు అవకాశం కల్పిస్తారు.
రాష్ట్రాలకు సూచనలు
ఈ సందర్భంగా కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) గౌరవ్ అగర్వాల్ సమర్పించిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
వివరాలను అప్లోడ్ చేయండి
ఆంధ్రప్రదేశ్కు ఆదేశం..