తెలంగాణ

telangana

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 8:40 PM IST

Minister Tummala about Crop Loss Farmers : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించినట్లు తెలిపారు.

Tummala Comments on BRS Government
Minister Tummala about Crop Loss Farmers

Minister Tummala about Crop Loss Farmers : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో మంత్రి వివరించారు. పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలు పరిపాలనతో రైతులను అగమ్యగోచరంగా చేశారని, ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

Tummala Comments on BRS Government :పదేళ్లకాలంలో ఏనాడు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆక్షేపించారు. కేవలం ఎన్నికలకు ముందు రూ. 150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని, రెండోమారు జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మూడోమారు కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతుబంధు(Rythu Bandhu) నిధులు జమ చేసిన నేతలు, ఇవాళ తమను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం విడుదల చేసిన మొదటి విడత రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని మంత్రి తుమ్మల అన్నారు. రెండో విడత రుణమాఫీకి ఔటర్ రింగ్ రోడ్డును కుదవ పెట్టి రూ.7 వేల కోట్లు మాత్రమే ఇచ్చి, మరో 13 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శించారు. నాగార్జునసాగర్ కింద మొదటి పంటకే నీరు ఇవ్వని నేతలు ఇవాళ రెండో పంటకు నీరు ఇవ్వలేదని తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

రైతులకు అందుబాటులో అధికారులు :ఇదికాగా వచ్చే రెండు మూడు రోజులూ ఇదే వర్ష వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారికి తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, మిర్చి, ఇతర పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.

ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రెండో దఫా పర్యటన - జలసౌధలో ఇంజినీర్లతో సమావేశం

నష్టపోయిన రైతులకు రూ.10 వేల పరిహారం వెంటనే ఇవ్వాలి : నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details