తెలంగాణ

telangana

వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పైలట్‌గా మెళకువలు

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 2:22 PM IST

Drone Pilot Madhavi Special Story : వ్యవసాయంలో తండ్రి పడిన కష్టం చూసి రైతుల సమస్యలు తీర్చాలనుకుందా యువతి. బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజినీరుగా పట్టా అందుకుని సాంకేతికత సాయంతో వ్యవసాయం ఎలా చేయాలో మెళకువలు నేర్చుకుంది. సొంతంగా ఏదైనా చేయాలన్న లక్ష్యంతో వినూత్నంగా ఆలోచించి డ్రోన్‌ పైలట్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి మెుదటి మహిళ డ్రోన్‌ పైలట్‌గా రికార్డు సృష్టించి రాణిస్తున్న భీంరెడ్డి మాధవి కథ ఇది.

Drone Pilot Madhavi
Drone Pilot Madhavi Special Story

వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పైలట్‌గా మెళకులు

Drone Pilot Madhavi Special Story : రెండేళ్ల నుంచి దేశంలో చాలా మంది మహిళలు డ్రోన్ పైలట్లుగా సత్తాచాటుతోన్నారు. ఆ కోవకు చెందుతుంది ఈ యువతి. తనకు తెలిసిన నైపుణ్యాన్ని నలుగురికి పంచి ఉపాధి కల్పించాలనుకుంది. స్వయం సహాయ బృందాల మహిళలు, ఔత్సాహిక యువతకు శిక్షణ ఇస్తోంది. యువ రైతులతో మేమకమవుతున్న వినూత్నంగా సాగుతోంది ఈ డ్రోన్‌ పైలట్‌.

ఈ యువతి పేరు మాధవి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంపల్లి స్వస్థలం. తండ్రి చంద్రయ్య రైతు. ఉన్నకొద్దిపాటి పొలంలో సాగు చేస్తూ మాధవిని చదివించాడు. చిన్నప్పటి నుంచి సాగులో తల్లితండ్రులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసింది ఈ యువతి. తనవంతుగా రైతన్నలకు సాయం చేయాలని అందుకు చదువొక్కటే మార్గమని బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌ చేసింది ఈ యువతి.

తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించా : ఐపీఎస్ మౌనిక

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా సొంతంగా ఏదైనా చేయాలనుకుంది మాధవి. ఆ లక్ష్యంతో హైదరాబాద్‌లో డ్రోన్‌ శిక్షణ తీసుకుంది. నాదర్‌గుల్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అద్భుతమైన నైపుణ్యాలు నేర్చుకుంది. డ్రోన్ నిర్వహణ, మరమ్మత్తులు, ఇతర అంశాలపై మంచి పట్టు సాధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - డీజీసీఓ ముఖాముఖిలో నెగ్గడమే కాకుండా డ్రోన్ ఇన్‌స్ట్రక్టర్ లైసెన్సు పొందించింది.

నేర్చుకున్న విద్య వ్యవసాయానికి ఉపయోగించి: వ్యవసాయం రంగంలో సమయం ఆదా, కూలీల కొరత అధిగమించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా మారింది. అందుకే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మెనెజ్మెంట్‌లోని డ్రోన్ ట్రైనింగ్ అకాడమీలో మహిళలు, ఔత్సాహిక యువతకు శిక్షణ ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోఉపాధి కల్పనకు డ్రోన్ టెక్నాలజీ ఓ వరంగా మారిందని అంటోంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా శిక్షణ ఇవ్వగా వీరిలో 100 మంది మహిళలు ఉన్నారని చెబుతోంది మాధవి.

వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారిని డ్రోన్‌ సాయంతో ఎలా చేయాలో నైపుణ్యాలు నేర్పుతుంది మాధవి. ఆరు రోజుల డ్రోన్ పైలట్ శిక్షణలో భాగంగా థియరీ, నిర్వహణ, మరమ్మత్తులు, ప్రయోగాత్మకంగా డ్రోన్‌ను ఎలా ఎగరవేయాలన్న అనేక అంశాలపై శిక్షణ ఇస్తుంది. పంట పొలాల్లో పిచికారీ సమయంలో ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన సురక్షితమైన పద్ధతులు నేర్పుతూ యువ రైతులతో మేమకమవుతుంది మాధవి.

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

సొంతూర్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందేందుకు వీలున్న రంగం ఇదని చెబుతోంది మాధవి. ఈ నైపుణ్యంతో పది నిమిషాల్లో 2 ఎకరాల విస్తీర్ణంలో స్ప్రే చేయవచ్చు. డ్రోన్ టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలున్న దృష్ట్యా మహిళలు మరింత ముందుకొచ్చి అన్నదాత సేవలో నిమగ్నం కావాలని మాధవి కోరుతోంది.

ఈ మహిళలకు ఆర్థిక సాయం: డ్రోన్‌ ద్వారా ఉపాధి పొందాలనకునే స్వయం సహాయక బృందాల మహిళలకు ఒక్కో యూనిట్‌పై రూ.10 లక్షల ఆర్థిక సాయం వస్తుంది. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 80 శాతం రాయితీపై అందిస్తుంది. మిగతా 20 శాతం లబ్ధిదారులైన మహిళా సంఘాల సభ్యులు భరించాల్సి ఉంటుందని ఎన్‌ఐపీహెచ్‌ఎం అధికారి చెబుతున్నారు

సపోర్ట్‌ లేకున్నా సలార్‌లో అవకాశం - జూనియర్ వరదరాజ మన్నార్‌ ఇంటర్వ్యూ

ప్రస్తుతం తన నైపుణ్యంతో స్వగ్రామంలో రైతులకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది మాధవి. మహిళ సాధికారతతోపాటు రైతులకు అవసరమైన డ్రోన్, ఏఐ, ఐఓటీ, రోబో టెక్నాలజీ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎస్‌హెచ్‌జీ ఏర్పాటు చేసి ప్రభుత్వం, బ్యాంకు సాయంతో ఓ అంకుర సంస్థ నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తుంది ఈ ఔత్సాహికురాలు.

18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..

ABOUT THE AUTHOR

...view details