Bhumatha Portal For Solving Land Problems : ధరణి! వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం ఈ పోర్టల్ తీసుకొచ్చింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్ ఉద్దేశం. కానీ, నిర్వహణలో అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. మాడ్యుళ్లపై అవగాహన లేమి, ఆపరేటర్ల తప్పిదాలు, పర్యవేక్షణ కొరవడడం తదితర కారణాలతో ఎంతోమంది భూయజమానులు అవస్థలు పడ్డారు. కనీసం ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్పార్టీ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులేస్తున్న రేవంత్రెడ్డి (Revanth Reddy) సర్కారు ముందుగా భూసమస్యల అధ్యయనానికి ధరణి పేరిట కమిటీ వేసింది. ఈ కమిటీ వివిధశాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ధరణి కమిటీ గుర్తించింది.
భూ సమస్యల సత్వర పరిష్కారంపై సర్కార్ నజర్ - ఆ బాధ్యత తహసీల్దార్కేనా!
Congress Bhumatha Portal : ధరణి కమిటీ అధ్యయనంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని వెల్లడైంది. 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూసమగ్ర సర్వేతోనే అనేక చిక్కులొచ్చాయని ధరణి కమిటీ నివేదించింది. ఆ రికార్డుల్ని గత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడం వల్లే భూ సమస్యలు, వివాదాలు ఎక్కువయ్యాయని కమిటీ తెలిపింది. ఇలా ధరణి పోర్టల్లో 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. కమిటీ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి మొదటి విడతగా కేసులు పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
అవసరమైతేఆర్ఓఆర్(R.O.R) చట్ట సవరణ లేదా కొత్తచట్టం తీసుకొచ్చే అంశం పరిశీలిస్తామన్నారు. దాంతోపాటు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆధీనంలో నడుస్తున్న పోర్టల్తో లక్షలాది రైతుల భూముల రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు. గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ వద్ద ఉంచడాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల భూముల రికార్డుల డేటాకు భద్రత ఉంటుందా.? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందంటూ ఆరా తీశారు. భూముల రికార్డుల డేటా ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని అధికారులను ప్రశ్నించారు.
Dharani Portal : భూమాత ప్రారంభానికి ముందు దేవాదాయ, వక్స్ భూములపై స్పష్టత రావాల్సి ఉందని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ఆ శాఖల్లో ట్రిబ్యునళ్లు లేకుండా జారీ చేసిన ఎన్ఓసీలపై కూడా విచారణ జరిపించాలని అనుకుంటుంది. అలాగే ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్ చేయాలని కమిటీ భావిస్తుంది. ప్రధానంగా గెజిట్ నోటిఫికేషన్తో సూచించిన అటవీ భూములను ధరణి పోర్టల్ లో అప్లోడ్ చేశారు. కానీ, డీమ్డ్ ఫారెస్టు పేరిట అటవీశాఖ గుర్తించిన భూములపై పేచీ ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే డీమ్డ్ ఫారెస్టు పేరిట లెక్కలు నమోదు చేశారు.