ETV Bharat / state

ఆర్ఓఆర్(ROR) చట్టాన్ని సవరించాల్సిందే - సీఎం ముందుకు కమిటీ మధ్యంతర నివేదిక

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:03 PM IST

CM Revanth Meet Dharani Committee : ధరణి పెండింగ్​ దరఖాస్తులను మార్చి మొదటి వారంలో తహశీల్దార్​ కార్యాలయాల్లో పరిష్కరించేలా విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి లోపాలను సరిదిద్దాలంటే ఆర్ఓఆర్(ROR) చట్టాన్ని సవరించాలని లేదా కొత్త చట్టం చేయాలని ధరణి కమిటీ సూచించింది. ధరణిపై మరింత లోతుగా అధ్యయనం చేసి భూరికార్డులను ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని, అవసరమైతే చట్ట సవరణ చేద్దామని సీఎం అభిప్రాయ పడ్డారు. అయితే కొత్త సమస్యలు తలెత్తకుండా చూడాలని, తుది నివేదిక వచ్చాకే శాశ్వత పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Dharani Committee Recommendations
CM Revanth Meet Dharani Committee

CM Revanth Meet Dharani Committee : ధరణిలో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగు దరఖాస్తుల పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో(Dharani) పెండింగులో ఉన్న 2 లక్షల 45 వేల దరఖాస్తుల పరిష్కరానికి అవసరమైన చర్యలుపై సీఎం చర్చించారు. రైతులను మరింత ఇబ్బంది పెట్టకుండా వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్(ROR) చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.

Dharani Committee Recommendations : కేవలం మూడు నెలల్లో హడావుడిగా భూ సమగ్ర సర్వే చేసి, ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని(Dharani Committee) కమిటీ సభ్యులు తెలిపారు. లక్షలాది సమస్యలు తలెత్తాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని ధరణి కమిటీ తెలిపింది. ధరణిలోని 35 మాడ్యుళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మాడ్యూల్​లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎంకు ధరణి కమిటీ తెలిపింది.

లక్షల సంఖ్య దరఖాస్తులను ఇప్పటికే తిరస్కరించారని, ఒక్కో తప్పును సవరించుకోవడానికి దాదాపు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని కమిటీ పేర్కొంది. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ధరణి డేటానే వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో, రైతుబంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని తెలిపింది.

ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

ధరణి లోపాలను సవరించాలంటే చట్టానికి సవరించడం లేదా కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయటం తప్ప మరో మార్గం లేదని సీఎంకు ధరణి కమిటీ వివరించింది. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూరికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. అయితే ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సీఎం సూచించారు.

ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా భూముల రికార్డులను నిర్వహించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్ పీటర్, సునీల్, బి.మధుసూదన్, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి. లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

రైతులకు గుడ్​న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్

'బీఆర్ఎస్​ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎంతో నష్టపోయాం - వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.