Minister Konda Surekha About Kavitha :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖతిప్పికొట్టారు. కవిత మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకే కేసీఆర్ పనులు ఇచ్చారని, వారిని పెంచి పోషించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏమీ చేశారని గులాబీ నేతలను ఉద్దేశించి మంత్రి ప్రశ్నించారు. రెండు నెలలు కాక ముందే తమ మీద విమర్శలు చేస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్కు లేదని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని, కేసీఆర్ హయాంలో ఆయన డీజీపీగా పని చేసిన విషయం మరిచారా అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రస్తుత టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి లిక్కర్ స్కాం చేశారా లేదా ఒక్కటే సెంటర్లో తమ వాళ్లకు గ్రూప్ వన్ పరీక్షలు పెట్టారా అంటూ కవితనుద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు.
Minister Konda Surekha About Singareni : గత ప్రభుత్వం సింగరేణి ఫండ్స్ను ఉమ్మడి మెదక్ జిల్లాకు, సిరిసిల్లకు తరలించిందని మంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు. సింగరేణిలో ప్రమోషన్లకు, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత మామూళ్లు తీసుకున్నావో చెప్పాలని కవితనుద్దేశించి నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని, ఎదో ఒకటి మాట్లాడాలనే ఆమె మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల అన్నింటిపై విచారణ చేస్తామని సురేఖ పేర్కొన్నారు.