తెలంగాణ

telangana

అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్​ నేతల విస్తృత ప్రచారం - ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు - congress campaign in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 10:08 PM IST

Congress Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు బీజేపీ, బీఆర్​ఎస్​లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించాలంటూ క్షేత్రస్థాయిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Congress Door to Door Election Campaign
Congress Election Campaign in Telangana

అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్​ నేతల విస్తృత ప్రచారం - ప్రతిపక్ష విపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు

Congress Door to Door Election Campaign : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ రాష్ట్రంలో ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కమార్ రెడ్డి ఆలేరులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. హోటల్‌లో స్వయంగా అల్పాహారం తయారు చేసిన కిరణ్‌కుమార్, విప్‌ బీర్ల ఐలయ్య, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ శుభ్రం చేసి ఓట్లు అభ్యర్థించారు.

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్​ఎస్​కు 15 ఎంపీ స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవవు అంటూ మంత్రి జోస్యం చెప్పారు. గత పదేళ్లలో బీజేపీ మతతత్వ రాజకీయం చేసి మతాల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు.

'తెలంగాణలో బీజేపీ ప్రజల్ని మత పరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. బీఆర్​ఎస్​ పార్టీ అయితే కుప్పకూలిపోయింది. ఎన్నికల తర్వాత వాళ్ల మనుగడ నాకైతే ప్రశ్నార్థకమే. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అప్పుల పాలు చేసింది. ఇండియా కూటమిలో రాహుల్​ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు.'-ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి

Minister Ponnam on BJP : కవిత అరెస్టుపై బీజేపీ, బీఆర్​ఎస్​లు​ డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి, తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ పొన్నం విమర్శించారు.

బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నియంతృత్వం వస్తుందని మంత్రి పొన్నం ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే బీజేపీలోకి వెళ్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పోలింగ్​ బూత్​ల వారీగా అత్యధిక మెజారిటీ తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంత్రి సీతక్క ధ్వజం :పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రమాణికమనీ, అలాంటి వాటికి తిలోదకాలిచ్చిన మోదీ ప్రభుత్వం, దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​తో కలిసి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు.

'దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. కానీ బీజేపీ దేవుడిని రాజకీయం చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోంది. విభజించు పాలించు అనే బీజేపీ విధానాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు తిప్పికొట్టాలి'- సీతక్క, గిరిజన సంక్షేమశాఖమంత్రి

లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్‌ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees

చేవెళ్ల లోక్​సభ స్థానాన్ని 'హస్త'గతం చేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details