తెలంగాణ

telangana

ఝార్ఖండ్​లో వీడిన ఉత్కంఠ- సీఎంగా చంపయీ సోరెన్, 10 రోజుల్లో బలపరీక్ష

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 7:26 AM IST

Updated : Feb 2, 2024, 8:18 AM IST

Jharkhand Political Crisis : ఝార్ఖండ్​లో రాజకీయ అనిశ్చితి వీడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్​ను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమించారు. దీంతో చంపయీ సోరెన్ శుక్రవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Jharkhand Political Crisis
ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా నేడు చంపయీ సోరెన్ ప్రమాణం!

Jharkhand Political Crisis : నగదు అక్రమ చలామణి కేసులో ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి వీడింది. 81 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంపయీ సోరెన్‌ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా చంపయీ సోరెన్​ను నియమించారు. పదవీ ప్రమాణం స్వీకరించడానికి ఆహ్వానించారు. 'చంపయీ సోరెన్​ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాం. ఎప్పుడు ప్రమాణం చేస్తారో చంపయీ సోరెన్ నిర్ణయించుకోవాలి' అని గవర్నర్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ నితిన్​ మదన్‌ కులకర్ణి అన్నారు.

10 రోజుల్లో బలపరీక్ష
మరోవైపు, తన ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించుకోవడానికి కొత్త సీఎంగా ఎన్నికైన చంపయీ సోరెన్​కు గవర్నర్​ 10 రోజుల సమయం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ రాజేశ్​ ఠాకుర్​ తెలిపారు. రాహుల్​ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్​ జోడో న్యాయ్​ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి చంపయీ సోరెన్​ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని అన్నారు. ఇదే విషయాన్ని ఝార్ఖండ్ సీఎల్పీ నేత ఆలంగీర్ ఆలం సైతం తెలిపారు.

గవర్నర్​ జాప్యంపై కాంగ్రెస్​ ఫైర్​
Congress Fires On Jharkhand Governor : ముఖ్యమంత్రిగా తనను నియమించాలంటూ చంపయీ సోరెన్‌ చేసిన అభ్యర్థనపై గవర్నర్​ నిర్ణయం తీసుకోకపోవడం ఒక పట్టాన రాజకీయపక్షాలు తొలుత కలవరపడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్‌ను కలిసిన చంపయీ, ప్రలోభాలకు అవకాశం లేకుండా ఉండాలంటే కొత్త సర్కారు ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మెజార్టీ సభ్యుల మద్దతున్న నేతను సీఎంగా ప్రమాణం చేయడానికి పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, ప్రజాతీర్పును కాలరాసినట్లేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

గవర్నర్​ తీరుపై మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేఖ్‌ సింఘ్వి స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని గవర్నర్లు భుస్థాపితం చేస్తున్నారని మండిపడ్డారు. పై నుంచి ఆదేశాలు వచ్చేవరకూ గవర్నర్‌ వేచిచూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ పరిణామాల తురణంలో దాదాపు అర్ధరాత్రి సమయంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ నిర్ణయం వెలువడింది.

హైదరాబాద్‌కు వచ్చేవాళ్లే కానీ
Jharkhand MLAs Shifting :ఝార్ఖండ్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి ముందుగా తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను రెండు ప్రైవేటు విమానాల్లో హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేసింది. కానీ, రాంచీ విమానాశ్రయంలో భారీ పొగమంచు కారణంగా అవి అక్కడే ఆగిపోయాయి. ఏఐసీసీ అధిష్ఠానం నిర్ణయం మేరకు గురువారం రాత్రికే 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వసతి ఏర్పాట్లు కూడా చేశారు. బేగంపేట విమానాశ్రయంలో రాత్రి 10 గంటల వరకు ఎదురుచూసి చివరకు పర్యటన రద్దు కావడం వల్ల వెనుదిరిగారు.

హేమంత్ సోరెన్ అరెస్ట్​- సుప్రీం కోర్టులో పిటిషన్- బీజేపీ విమర్శలు

హైదరాబాద్​కు JMM ఎమ్మెల్యేలు! గవర్నర్ వద్దకు చంపయీ సోరెన్

Last Updated :Feb 2, 2024, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details