ETV Bharat / bharat

హేమంత్ సోరెన్ అరెస్ట్​- సుప్రీం కోర్టులో పిటిషన్- బీజేపీ విమర్శలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 7:23 AM IST

Updated : Feb 1, 2024, 11:32 AM IST

Jharkhand Political Crisis
Jharkhand Political Crisis

Jharkhand Political Crisis : ఝార్ఖండ్‌ రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు జరిగాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం సోరెన్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్‌ రాజీనామా చేశారు. అయితే ఈడీ సమన్లపై హేమంత్ సోరెన్ ఝార్ఖండ్​ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఉపసంహరించుకుని సుప్రీం కోర్టును సవాల్ చేశారు.

Jharkhand Political Crisis : ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా( జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ అరెస్టయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం ఈడీ అధికారులు సోరెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్‌ రాజీనామా చేశారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

అరెస్ట్​పై సుప్రీం కోర్టులో సవాల్
అనంతరం, ఈడీ అరెస్ట్​ను సవాలు చేస్తూ గురువారం హేమంత్ సోరెన్​ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. అంతకుముందు, ఝార్ఖండ్‌ హైకోర్టులో వేసిన రిట్​ పిటిషన్​ను హేమంత్ సోరెన్ ఉపసంహరించుకున్నట్లు ఆయన తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్​ తెలిపారు.

7 గంటల పాటు ఈడీ విచారణ
అంతకుముందు బుధవారం కీలక పరిణామాలు జరిగాయి. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని హేమంత్‌ సోరెన్‌ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అటు విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరింది. దీనికి సంబంధించి ఝార్ఖండ్‌ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలిసింది.

ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్‌ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. అప్పటికే సోరెన్‌ నివాసంతోపాటు రాజ్‌భవన్, ఈడీ కార్యాలయంవద్ద 144 సెక్షన్‌ విధించారు. దాదాపు 7వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. పర్యవేక్షణ కోసం ముగ్గురు ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్‌ను ఈడీ అధికారులు 7 గంటలకుపైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్‌ సోరెన్‌ సమాధానాలివ్వలేదని తెలిసింది. ఆ తరువాత ఆయనను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ తెలిపారు. బుధవారం రాత్రి హేమంత్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈడీ అధికారులపై హేమంత్‌ సోరెన్‌ పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదు చేశారు.

కొత్త సీఎంగా చంపయీ సోరెన్
అరెస్టుకు ముందు సీఎం పదవికి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేశారు. హేమంత్‌ రాజీనామాను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదించారు. తొలుత సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడం వల్ల చివరకు పార్టీ సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కల్పనా సోరెన్‌ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్‌ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు ఝార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఆ తరువాత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. చంపయీ సోరెన్‌ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా చంపయీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన చంపయీకి శిబు సోరెన్‌తో ఎటువంటి బంధుత్వం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని జేఎంఎం సంకీర్ణ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంపయీ సోరెన్‌ ప్రకటించారు.

బీజేపీ విమర్శలు
మరోవైపు హేమంత్‌ సోరెన్‌ అరెస్టుపై బీజేపీ స్పందించింది. ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని వ్యాఖ్యానించింది. గతంలో లాలూ ప్రసాద్, సోరెన్, సోనియాలను అరెస్టు చేయాలని డిమాండు చేసిన కేజ్రీవాల్‌ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెఇ్జాద్‌ పూనావాలా విమర్శించారు.

ఇండియా కూటమి సమావేశం
హేమంత్‌ సోరెన్‌తో బలవంతంగా రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ప్రభుత్వ సంస్థలుగా కాకుండా ప్రతిపక్షాలను లేకుండా చేసే అధికార బీజేపీ విభాగాలుగా తయారయ్యాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సోరెన్ రాజీనామా, అరెస్టు తర్వాత తలెత్తిన పరిస్థితులపై ఇండియా కూటమి నాయకులు బుధవారం సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!

బీజేపీని బలోపేతం చేసేందుకే సీపీఐతో కాంగ్రెస్ దోస్తీ : మమత

Last Updated :Feb 1, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.