Chandigarh Mayoral Polls : చండీగఢ్ మేయర్ ఎన్నికలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి కులదీప్ కుమార్పై మనోజ్ గెలుపొందారు. కాగా, పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మేయర్ ఎన్నిక జరిగింది. భారీ భద్రత నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీని వరించింది. మరోవైపు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థి మనోజ్ సోంకర్ గెలుపొందడం వల్ల సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు బీజేపీ మోసపూరితంగా మేయర్ పదవిని దక్కించుకుందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిదని ఆరోపించారు.
ఓటు వేసేందుకు కూటమి కౌన్సిలర్లు నో!
ఇక పోలైన 36 ఓట్లలో మనోజ్ సోంకర్కు 16 ఓట్లు దక్కాయి. చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ ఎక్స్-అఫీషియో మెంబర్గా బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థికి 12 ఓట్లు లభించగా, 8 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పొత్తులో భాగంగా మేయర్ పదవి కోసం ఆమ్ఆద్మీ పార్టీ, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టాయి. ఐతే సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు నిరాకరించారు. దీంతో బీజేపీ అభ్యర్థి రాజేందర్ కుమార్ డిప్యూటీ మేయర్గా గెలుపొందారు. కాగా, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు.
'వచ్చే ఎన్నికల్లో వాళ్లు ఎంతకైనా తెగిస్తారు'
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా విజయం సాధించిందని ఆప్ ఆరోపించింది. మేయర్ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఇది ఆందోళన చెందాల్సిన అంశమన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చూశాక సార్వత్రిక ఎన్నికల్లో వారు ఎంతవరకైనా వెళ్లేందుకు వెనకాడరని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేజ్రీవాల్ అనుమానం వ్యక్తంచేశారు.
"76 ఏళ్ల క్రితం ఈరోజు మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. సరిగ్గా అదే రోజు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసింది. వారి(బీజేపీ) నిజాయితీ, గూండాయిజం దృశ్యాల్లో కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యావత్ దేశం దీనిని చూస్తోంది. నేడు ప్రజాస్వామ్యానికి బ్లాక్డే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావని నేను అనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా కమలం నేతలు దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలు నిజాయితీగా జరిగి ఉంటే ఈరోజు ఇండియా కూటమి తన మొదటి విజయాన్ని నమోదు చేసేది. ఈ ఎన్నికల్లో 25% ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఇవి ఎలాంటి ఎన్నికలో నాకు అర్థం కావడంలేదు. గెలుపు కోసం బీజేపీ ఎలాంటి అక్రమాలకైనా పాల్పడుతుందనడనికి ఇది ఒక నిదర్శనం."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
ప్రజాస్వామ్యం దోపిడీకి గురైంది : పంజాబ్ సీఎం
చండీగఢ్ మేయర్ ఎన్నిక తీరుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యం దోపిడీకి గురైందని అన్నారు. 'బీజేపీ పక్షాన ఉన్న 16 మందికి ఓటు ఎలా వేయాలో తెలుసు, మా వైపు ఉన్న 8 మందికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియదు!. బీజేపీ మైనార్టీ విభాగం నేత అనిల్ మసీహ్ను ప్రిసైడింగ్ అధికారిగా పెట్టారు. వెన్నెముక సమస్యతో ఎన్నికకు హాజరుకాలేనని 18న ప్రిసైడింగ్ అధికారి చెప్పారు. ఈ సమస్య నిజమే అనేలా ప్రిసైడింగ్ అధికారి వ్యవహరించారు. కానీ, అది అబద్ధం అని ఈరోజు నాకు తెలిసింది. ప్రిసైడింగ్ అధికారికి నిజంగా వెన్నెముక సమస్యే ఉంటే అతడు ఓట్లను సరిగా లెక్కించేవారు' అని భగవంత్ మాన్ పేర్కొన్నారు.